
పగ, ద్వేషం వద్దు, రాజీ మేలు
● లోక్ అదాలత్లో కలిసిన జంటలు
గౌరిబిదనూరు: కోపం, ద్వేషం పక్కన పెట్టి రాజీ చేసుకుని మీ కాలాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని సీనియర్ జడ్జి గీతా కుంబార్ తెలిపారు. కోర్టు ఆవరణలో బృహత్ లోక్ అదాలత్ను నిర్వహించి మాట్లాడారు. కోప తాపాలను విడనాడి మానవ సంబంధాలకు విలువనిచ్చి కోర్టుల్లో కేసులను రాజీ సంధానాల మూలకంగా పరిష్కరించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా విడాకుల కోసం వచ్చిన 5 జంటలకు రాజీ చేశారు. దాంపత్య జీవితాన్ని కొనసాగించడానికి వారు అంగీకరించారు. 1.25 కోట్ల రూపాయల ఆర్థిక పరమైన కేసులను పరిష్కరించారు. ఇందులో ఎక్కువగా బ్యాంకుల కేసులే ఉన్నాయి. జడ్జిలు గణేశ్, పుష్ప, వకీళ్లు దినేశ్, లింగప్ప, సంధానకర్త రూప, చలువయ్య తదితరులు పాల్గొన్నారు. మళ్లీ ఒక్కటైన జంటలను అందరూ అభినందించారు.
విదేశీ యువతి అరెస్టు..
5 కేజీల డ్రగ్స్ సీజ్
బనశంకరి: బెంగళూరు నగరంలో కొన్ని పబ్లపై సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించి విదేశీ డ్రగ్ పెడ్లర్ను అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ఎంజీ రోడ్డులోని మిరాజ్ పబ్, కోరమంగలలో సన్బర్గ్ పబ్లలో సోదాలు నిర్వహించారు. విదేశాల నుంచి చదువుకోవడానికి భారత్కు వచ్చిన ప్రిన్సెస్ అనే యువతి డ్రగ్స్ను అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఆమెను అరెస్టు చేసి 5 కేజీల 325 గ్రాముల ఎండీఎంఏ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈమె బెంగళూరులో మకాం పెట్టి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. కబ్బన్పార్కు పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఉగ్ర నిందితులకు
భారీగా సొమ్ములు
● ఎన్ఐఏ తనిఖీలో వెల్లడి
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సెంట్రల్ జైలులో ఉగ్రవాది నాసిర్, అతని బృందానికి సహాయం చేస్తున్నారని అరెస్టయిన జైలు మానసిక వైద్యుడు నాగరాజ్, ఏఎస్ఐ చాంద్ బాషా, అనుమానిత ఉగ్రవాది జునైద్ అహ్మద్ తల్లి అనీస్ ఫాతిమా బ్యాంకు అకౌంట్లను ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేస్తున్నారు. వారికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లింపులు జరిగినట్టు గుర్తించారు. ఆన్లైన్ ద్వారా, నగదుగా, గిఫ్ట్ల రూపంలో స్వీకరించారు. టెర్రరిస్టు నాసిర్ సూచనల మేరకే డబ్బులు తీసుకున్నట్టు తెలిసింది. చాంద్ బాషా తన కొడుకు అకౌంట్కు కూడా డబ్బులు వేయించాడు. నాగరాజు సహాయకురాలు పవిత్ర ఖాతాలోకి రూ.70 లక్షల నగదు బదిలీ జరిగింది. చాంద్బాషా ఇంట్లో హార్డ్ డిస్క్, పెన్డ్రైవ్, డైరీని సీజ్ చేశారు. 2012 నుంచి ఉగ్ర ఖైదీలకు మొబైళ్లు ఇతర వస్తువులు, సౌకర్యాలు కల్పించారని తేలింది. ఆ డబ్బుతో నిందితులు చాలా చోట్ల ఆస్తులు కూడా ఖరీదు చేశారు.
పుంజుకోనున్న వర్షాలు
యశవంతపుర: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే వారం రోజుల పాటు ముంగారు వానలు పుంజుకొనే అవకాశం ఉన్నట్లు బెంగళూరు వాతావారణశాఖ అధికారులు తెలిపారు. వారం రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. కరావళి, మలెనాడు ప్రాంతాలలో భారీ వానలు పడవచ్చు. ఒళనాడు ప్రాంతాలలో వానలు తగ్గడం వల్ల రైతులు విత్తనాలు వేయడానికి ఆలస్యమైంది. జూన్, జూలైలో పడవలసినంత వానలు రాలేదు. అరేబియా సముద్రంలో ఆవర్తనం వల్ల రాష్ట్రంలో మేఘావృతమైంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని తెలిపారు. 18వ తేదీ వరకు అధిక వానలు పడడానికి ఆస్కారం ఉంది.
ఆర్టీసీ బస్సుల్లో
కొత్త లగేజీ చార్జీలు
బనశంకరి: ఇకపై కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో పెంపుడు జంతువులు, ఫ్రిడ్జ్, వాషింగ్మెషిన్ వంటి ఉపకరణాలను సైతం తీసుకెళ్లవచ్చు. అయితే నిర్ణీత చార్జీలు చెల్లించాలి. 30 కిలోలకు పైగా లగేజీ ఉంటే లగేజీ చార్జీ తీసుకోవాల్సిందే. శునకాన్ని చైనుతో బస్సులో తీసుకెళ్లవచ్చు, పెద్దవారు 30 కిలోల లోపు, పిల్లలు 15 కిలోల లోపు లగేజీని బస్సుల్లో ఉచితంగా తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. 30 కేజీలు దాటితే నాన్ ఏసీ బస్సుల్లో రూ.5, ఏసీ బస్సుల్లో రూ.10 రుసుము నిర్ణయించారు. 51 నుంచి 55 కేజీల వరకు అయితే రూ.44 – 55 మధ్య రుసుము విధిస్తారు. శునకం కూన, పిల్లి, పంజరంలో ఉన్న పక్షికి పిల్లల టికెట్ను వసూలు చేస్తారు. ఇంకా పలు వస్తువులకు రుసుమును నిర్ధారించారు.