
మధుమేహం, ధూమపానం, బీపీ..
బనశంకరి/ యశవంతపుర: రాష్ట్రంలో రోజురోజుకు గుండెపోటు మరణాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖకు టెక్నికల్ కమిటీ నివేదిక అందజేయగా, అందులోని అంశాలపై చర్చ ఆరంభమైంది. బెంగళూరు జయదేవ హృద్రోగ ఆసుపత్రి డైరెక్టర్ రవీంద్రనాథ్, ఇతర నిపుణులు నివేదికను అందజేశారు. పలు జిల్లాల్లో గుండెపోటుతో ఆస్పత్రుల్లో చేరిన 251 మంది ఆరోగ్య పరీక్షల వివరాలను పొందుపరిచారు. ఇందులో 87 మంది రోగులకు షుగర్ ఉన్నట్లు తెలిసింది. 102 మందిలో బీపీ, 35 మందిలో అధిక కొలె స్ట్రాల్ ఉంది. 40 మందిలో గుండె సంబంధ రోగాలు ఉన్నట్లు కనిపెట్టారు. 251 మందిలో 111 మంది ధూమపానం చేస్తుండగా, 19 మందిలో కోవిడ్ హిస్టరీ ఉంది. 77 మందిలో ఎలాంటి రోగాలు లేవు. 30 ఏళ్ల కంటే తక్కువ ఉన్న 12 మంది హృద్రోగుల గురించి అధ్యయనం చేశారు. 31 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న 66 మంది హృద్రోగులను పరిశీలించారు. 41 నుంచి 45 ఏళ్ల వయసున్న 172 మంది హృద్రోగులకు పరీక్షలు చేసినట్లు తెలిపారు.
చిక్కమగళూరులో లారీ డ్రైవర్..
గుండెపోటు ఘటనలు హాసన్ పొరుగున ఉన్న చిక్కమగళూరును చుట్టుముట్టాయి. గుండెపోటుతో రెండురోజుల క్రితం 29 ఏళ్ల యువకుడు చనిపోయాడు. అలాగే శుక్రవారం రాత్రి అజ్జంపుర పట్టణంలో నివాసం ఉంటున్న లారీ డ్రైవర్ సగీర్ అహ్మద్ (45) భోజనం చేస్తుండగా ఎదలో నొప్పి అని చెప్పాడు. క్షణాల్లోనే కుప్పకూలి మృతి చెందాడు.
గుండెపోటుతో పోలీసు...
బెళగావి జిల్లా గోకాక్లో ఏఎస్ఐ గుండెపోటుతో మృతి చెందారు. ఎఎస్ఐ మీరానాయక్ (55), హుబ్లీ పోలీసు స్టేషన్లో పని చేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి గోకాక్ గ్రామదేవత జాతర బందోబస్తులో ఉన్నారు. గోకాక్ పట్టణంలోని ఎస్సీ ఎస్టీ హాస్టల్లో పోలీసులకు వసతి కల్పించారు. శనివారం తెల్లవారుజామున మీరానాయక్కు గుండెపోటు వచ్చింది, వెంటనే పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించారు. మృతదేహానికి గోకాక్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపించారు. డ్యూటీకి వెళ్లి కానరాని లోకాలకు చేరడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
గుండెపోటు కారణాలపై కమిటీ నివేదిక

మధుమేహం, ధూమపానం, బీపీ..