
శత్రు దుర్భేద్యం..నాటి రాజాతిథ్య గృహం
సాక్షి,బళ్లారి: భారత దేశాన్ని బ్రిటిషులు, ముస్లిం రాజులు ఇలా ఎందరో అక్రమించుకుని వందల సంవత్సరాలు పాలించి దేశ సంపదను దోచుకోవడంతో పాటు, ఇక్కడ చరిత్రను, ఆచార, విచారాలను కూడా నాశనం చేసిన తీరును చరిత్ర ఆధారాలు నేటికి కళ్లకుకట్టినట్లు కనిపిస్తుంటాయి. అయితే వారి పాలనలో పలు కట్టడాలు వందల వేల ఏళ్ల నాటి భవనాలు చారిత్రాత్మక ప్రాంతాలుగా నేటికి చెక్కు చెదరకుండా, ఎంతో అత్యద్భుతంగా నిలిచి ఉన్నాయి. అలాంటి కట్టడాల్లో, చరిత్ర పుటల్లోచరిస్థాయిగా నిలిచిపోయిన మల్లిక్ సరాయ్ కట్టడం ఒకటి. ఇది కర్ణాటకలోని బీజాపూర్లో వెలసి ఉంది. దక్షిణ భారత దేశంలో సుమారు 200 సంవత్సరాలు పాటు పాలించిన బీజాపూర్ అదిల్ షాహి రాజులు తమ హయాంలో దుర్గాలు, కోటలు, బురుజులు, మసీదులు, రాజభవనాలు, మహాల్, చావడిలు, చెరువు కట్టలు, సమాధులను అత్యంత ఆకర్షణీయంగా నిర్మించారు. అలాంటి వాటిలో మల్లిక్ సరాయి అనే అతిథి గృహం కూడా అత్యంత నయనమనోహరం.
కారాగృహ కేంద్రంగా మల్లిక్ సరాయ్ :
ప్రస్తుతం విజయపుర జిల్లా కారాగృహ కేంద్రంగా వినియోగిస్తున్న ఈ మల్లిక్ సరాయ్ దేశంలోనే అత్యంత పురాతన కారాగృహాల్లో ప్రముఖమైనదని చెప్పవచ్చు. దర్గా జైలుగా వాసికెక్కిన మల్లిక్ సరాయ్ మూలస్థావరం జైలు కాదు. తనదైన చారిత్రాత్మక ప్రాధాన్యత గల ఓ భవ్యమైన రాజాతిథ్య గృహం. ఈ కట్టడాన్ని 1648లో మహమ్మద్ ఆదిల్ షాహి, మంత్రి నవాబ్ మల్లిక్ నిర్మించారు. ఆ తర్వాత ఈ చారిత్రాత్మక కట్టడం మల్లిక్ సరాయ్గా వాసికెక్కిందని ప్రముఖ చరిత్ర కారులు కృష్ణ కొల్హార కులకర్ణి చెబుతున్నారు. పర్షియన్ శైలి ప్రవేశ ద్వారాన్ని కలిగిన ఈ కట్టడం నల్లటి రాతి, విశాలమైన గోడలతో కూడి ఉంది. మల్లిక్ సరాయ్ ప్రవేశ ద్వారంలో శాంతం, సురక్షిత వాస్తవ్యం కోసం స్వాగతిస్తున్నామంటూ, తామ్రవర్ణంలో రాసిన అరబిక్ రాత అతిథులను ఆత్మీయంగా స్వాగతిస్తోంది. ఆదిల్ షాహి ఆస్థానానికి దేశ, విదేశాల నుంచి వచ్చే రాజులు, ఉన్నత శ్రేణి వ్యాపారస్తులు సురక్షితంగా బస చేయడానికి ఈ మల్లిక్ సరాయ్ను వినియోగించుకునేవారు. రాళ్లు, గారా తదితరాలను వినియోగించి, నిర్మించిన మల్లిక్ సరాయ్ కట్టడం భూకంపం తదితర ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలను కూడా తట్టుకునే సామర్థ్యం ఉంది. అలాగే ఈ కట్టడం భద్రత దృష్ట్యా అతి ఎత్తైన దక్షిణ గోడలను కలిగి ఉంది. దీంతో ఈ గోడలను ఏ ఒక్కరు లోపలకి రావడానికి కాని, లోపలకు వచ్చిన వారు బయటకు వెళ్లడానికి సాధ్యం కాదు. ఏది ఏమైనా ప్రధాన ద్వారం గుండానే రాకపోకలు సాగించాలి. ఇంత భద్రత సురక్షిత కట్టడం ఇది. ఈ నేపథ్యంలో 1887లో బ్రిటిష్ సర్కార్ హయాంలో కెప్టన్ విల్కిన్ ఈ కట్టడాన్ని జైలుగా మార్చారు. ఈ 1983లో దీన్ని కేంద్ర కారాగృహంగా తీర్చిదిద్దారని, ప్రస్తుతం దర్గా జైలుగా పిలువబడుతోంది. ఆదిల్ షాహి కాలం గుర్రాలు బస కేంద్రాలు ప్రస్తుతం బ్యారక్లుగా మార్పు చెందాయి. ఆ మేరకు ఈ జైలులో 10 బ్యారక్లు ఉన్నాయి. ఒక్కో బ్యారక్లో 30 నుంచి 40 మంది ఖైదీలను ఉంచవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడంలో హజరత్ సయ్యద్ రాజమహమ్మద్ ప్రముఖమైంది. ఈ మొత్తం కట్టడం చారిత్రాత్మక ప్రాధాన్యతో ఎక్కడ దెబ్బతినకుండా సుభద్రంగా ఉంది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో మల్లిక్ సరాయిలో సుమారు నాలుగు ఎకరాలు జైలు ఉంది.ఇక మిగిలిన ఓ ఎకరంలో తోటలు, అతిథి గృహం వెలసి ఉన్నాయి. జైలు చుట్టు రెండు ఆవరణ గోడలు ఉన్నాయి. ఈ కారణంతో భద్రత దృష్ట్యా ఈ జైలు దేశంలో అత్యంత సురక్షితమైందిగా ఖ్యాతికెక్కింది. ఖైదీలు ఎట్టి పరిస్థిల్లో ఇక్కడ నుంచి పారిపోవడానికి వీలు పడదని చెప్పవచ్చు. ఈ దర్గా జైలు చారిత్రాత్మక తీపిగురుతుల స్మారకంగా ప్రజలు వీక్షణకు అనుకూలం కానుంది.
ప్రస్తుతం విజయపుర జిల్లా కారాగృహ కేంద్రం
1648లో మహమ్మద్ ఆదిల్ షాహి హయాంలో నిర్మాణం
బీజాపూర్లో మల్లిక్ సరాయ్గా
వాసికెక్కిన కట్టడం

శత్రు దుర్భేద్యం..నాటి రాజాతిథ్య గృహం

శత్రు దుర్భేద్యం..నాటి రాజాతిథ్య గృహం