
బూందీని ఆరబెట్టిన దృశ్యం
మైసూరు: జిల్లాలోని నంజనగూడు తాలూకాలో ఆధ్యాత్మిక, విద్యా, సామాజిక సేవలతో ప్రసిద్ధి చెందిన సుత్తూరు మఠంలో జగద్గురు శివరాత్రీశ్వర శివయోగి జాతర మహోత్సవం మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఆరు రోజుల పాటు జరిగే ఈ జాతర మహోత్సవంలో కర్ణాటకతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రానున్నారు. రోజూ పలు రకాల భక్తి కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, వ్యవసాయ వస్తు, పశువుల ప్రదర్శనలు వంటివి జరుగుతాయి. పాల్గొనే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వేలకొద్దీ భక్తులకు ఉపాహారం, భోజనాలను అందించడానికి మఠం వంటశాలలో వంటకాలను సిద్ధం చేశారు.
వెయ్యి క్వింటాళ్ల బియ్యం
ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండడంతో గతం కంటే అధికంగా ఈసారి భక్తుల తాకిడి ఉంటుందని భావిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఉపాహారం, భోజనాలను వడ్డిస్తారు. ఇన్నివేల మందికి వంటలు చేయడమంటే మాటలు కాదు, ఇందుకోసం 1000 క్వింటాళ్ల బియ్యం, 180 క్వింటాళ్ల కంది పప్పు, 1,500 క్యాన్ల వంట నూనె, 12 టన్నుల బెల్లం, 4 వేల కిలోల కారం పొడి, 250 క్వింటాళ్ల చక్కెర, 500 కిలోల నెయ్యి, 800 కిలోల ఎండు ద్రాక్ష, గోడంబి, 8 వేల లీటర్ల పాలు, 28 వేల లీటర్ల పెరుగు, 25 వేల కొబ్బరికాయలు, 5 టన్నుల ఊరగాయను తెప్పించారు. ఈ ఖర్చును కొంత మఠం భరిస్తే, మరికొంత భక్తులు, ధనవంతులు విరాళమిచ్చారు.
పలు రకాల వంటకాలు
ఉదయం టిఫిన్లుగా ఉప్మా, కేసరి బాత్, కారాబాత్, తీపి అన్నం, కారా పొంగల్, పులిహోర, చిత్రాన్నం ఒక కారం, ఒక తీపి వంటకాన్ని వడ్డిస్తారు. అన్నం, సాంబారు, పెరుగన్నం, మజ్జిగ, పాయసం, లడ్డును భోజనంలో వడ్డిస్తారు. ఇక ఆకుకూరలు, కూరగాయలు లెక్కలేనన్ని లోడ్లు వస్తున్నాయి. వంటలను చేయడానికి సుమారు 500 మంది వంటవారిని నియమించారు. అలాగే రోజూ 5 వేల మంది సేవా కార్యకర్తలు ఆహారం వడ్డించే పనుల్లో సాయం చేస్తారు. జెఎస్ఎస్ విద్యాసంస్థల్లోని విద్యార్థులు ఇందులో పాల్గొంటారు.
6 రోజుల పాటు వేలాది భక్తులకు
ఉపాహారం, భోజనాలు
లారీల కొద్ది బియ్యం, దినుసులు వినియోగం

దాతల ద్వారా సేకరించిన బియ్యం బస్తాలు

బూందీ తయారు చేస్తున్న వంట మనుషులు