అట్టహాసంగా సైకిళ్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా సైకిళ్ల పంపిణీ

Jul 10 2025 6:28 AM | Updated on Jul 10 2025 6:28 AM

అట్టహ

అట్టహాసంగా సైకిళ్ల పంపిణీ

కరీంనగర్‌టౌన్‌:

మోదీ గిఫ్ట్‌గా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ బుధవారం కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో టెన్త్‌ విద్యార్థులకు చేపట్టిన సైకిళ్లను పంపిణీ అట్టహాసంగా జరిగింది. మొత్తం 20వేల సైకిళ్లను స్వయంగా కొనుగోలు చేసిన బండి సంజయ్‌ వాటిని దశలవారీగా పంపణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత కరీంనగర్‌ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. అతి త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మోదీ కిట్స్‌ను అందజేస్తానని హామీ ఇచ్చారు. నేను ఎంపీగా గెలిచానంటే అందులో 50 శాతం ఓట్లు పిల్లలు తమ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి ఒట్టు వేయించుకొని గెలిపించారని అన్నారు. నామీద ఇంత అభిమానం కురిపిస్తున్న పిల్లల రుణం తీర్చుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టానని స్పష్టం చేశారు.

అందరికీ ఆదర్శం: టీచర్‌ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

బండి సంజయ్‌ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం మా అందరికీ ఆదర్శం. ఇతర ప్రజాప్రతినిధులు కూడా స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయాలనే ఆలోచనను తీసుకొచ్చారు. పేదరికం నుంచి వచ్చిన మోదీ చాయ్‌ అమ్ముతూ ప్రధానిగా ఎదిగారు. బండి సంజయ్‌ కూడా సామాన్య కుంటుంబం నుంచి వచ్చి కేంద్ర మంత్రి అయ్యారు.

క్రెడిట్‌ అంతా కేంద్ర మంత్రిదే: కలెక్టర్‌ పమేలా సత్పతి

ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌ చదివే విద్యార్థులందరికీ 20వేల సైకిళ్లను ఇవ్వడం గొప్ప విషయం. ఈ క్రెడిట్‌ అంతా కేంద్ర మంత్రిదే. పిల్లలకు మొదటి ఆస్తి సైకిల్‌. నాకు కూడా చిన్నప్పుడు సైకిలే నా ఆస్తి. ఆటోలు, బైకులు, కార్లపై స్కూల్‌కు వెళ్లి ట్రాఫిక్‌కు కారణం కంటే.. సైకిల్‌పై స్కూల్‌కు వెళ్లడమే మంచిది. దీనివల్ల ఎవరిపై ఆధారపడకుండా సమయానికి స్కూల్‌కెళ్లి వచ్చే అవకాశముంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు సైకిల్‌ అలవాటు చేయాలి. తద్వారా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌కు ప్రతీక సైకిల్‌. మీరంతా బాగా చదివి టెన్త్‌ క్లాస్‌ ఫలితాల్లో అగ్రగామిగా నిలవాలి.

మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: సీపీ గౌస్‌ ఆలం

ఇది చాలా గ్రాండ్‌ ప్రోగ్రాం. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రతిపాదన చేశారు. ఇంత తొందరగా కార్యరూపం దాల్చేలా చేయడం చాలా గొప్ప విషయం. మనస్ఫూర్తిగా కేంద్ర మంత్రికి అభినందనలు చెబుతున్నా. నాకు సైకిల్‌ చాలా ఇష్టం. సైకిల్‌పై జాగ్రత్తగా వెళ్లాలి. లేకుంటే ప్రమాదాలు జరిగే ప్రమాదముంది.

చిన్న ఆలోచనకు కార్యరూపం: మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌ చదివే విద్యార్థులకు సైకిల్‌ ఇవ్వాలనే ఆలోచనను బండి సంజయ్‌ తొలుత మాతో పంచుకున్నారు. ఒక చిన్న ఆలోచన ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా గొప్ప విషయం. అది కేంద్ర మంత్రికే చెల్లింది. టెన్త్‌ విద్యార్థులకు స్పెషల్‌ క్లాసులుంటాయనే ఉద్దేశంతో వారికి ఆర్థిక భారం కాకుండా ఉండేలా ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం. ఇందులో భాగస్వాములం కావడం చాలా ఆనందంగా ఉంది.

ఈ సైకిళ్లు మోదీ ఇస్తున్న గిఫ్ట్‌

త్వరలో విద్యార్థులందరికీ మోదీ కిట్స్‌ ఇస్తా

కేంద్ర మంత్రి బండి సంజయ్‌

సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌కు ప్రతీక సైకిల్‌: కలెక్టర్‌ పమేలా సత్పతి

బండికి ముందస్తు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు

అంబేడ్కర్‌ స్టేడియం నుంచి ప్రతిమ చౌరస్తా వరకు సైకిల్‌ ర్యాలీ

ర్యాలీలో జై బండి సంజయన్న అంటూ నినదించిన విద్యార్థులు

శుభాకాంక్షలు చెప్పిన విద్యార్థులు

ఈనెల 11న బండి సంజయ్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని విద్యార్థులు బండికి ముందస్తు బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పారు. సైకిళ్ల పంపిణీ అనంతరం అంబేడ్కర్‌ స్టేడియం నుంచి ప్రతిమ చౌరస్తా వరకు విద్యార్థులు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జై బండి సంజయన్న అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశ్విని, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజీపీ కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ మేయర్లు, డి.శంకర్‌, యాదగిరి సునీల్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, డీఈవో మొండయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.

అట్టహాసంగా సైకిళ్ల పంపిణీ1
1/1

అట్టహాసంగా సైకిళ్ల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement