ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
● అధికారులకు కలెక్టర్
ఆశిష్ సంగ్వాన్ ఆదేశం
● ప్రజావాణికి 87 ఫిర్యాదులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 87 ఫిర్యాదులు అందాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరుకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను ఆయా శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించడం లేదా పరిష్కార మార్గాలు చూపడం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ముఖ్యంగా భూభారతి, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తహసీల్దార్లను ఆదేశించారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, మధు మోహన్, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి


