నీటి సంరక్షణ పనుల పరిశీలన
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి సంరక్షణ తీరును శుక్రవారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ పాండే పరిశీలించారు. ‘స్వచ్ఛతా హీ సేవ’ స్పెషల్ క్యాంపెయిన్ 5.0, ఒక చెట్టు– అమ్మ పేరుతో కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ ప్రాజెక్టును గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు సందర్శించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు, ఆయకట్టుకు సాగునీటి కేటాయింపులు, ప్రాజెక్టు వద్ద పరిసరాల పరిశుభ్రతను తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద శ్రమదానం చేశారు.
కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు నందిపేట కేదారేశ్వరస్వామి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం నిజామాబాద్లో ఇటీవల హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం నిజామాబాద్ కలెక్టర్, పోలీసు కమిషనర్, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 3.30గంటలకు కామారెడ్డి సఖి కేంద్రంలో ఫరీదుపేట అత్యాచార బాధితురాలిని పరామర్శించనున్నారు.
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం గ్రామంలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేయడానికి హాజరైన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డికి నిరసన సెగ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్పార్టీలో చేరిన పోచారం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని, అంగన్వాడీ భవనం నిర్మాణం, పాఠశాల ప్రహరీ నిర్మాణం ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పాలంటూ ప్లకార్డు లు ప్రదర్శించారు. నిరసన కారులను పోలీసు లు అడ్డుకుని అరెస్టు చేశారు. నాయకులు మ న్నె అనిల్, మమ్మాయి లక్ష్మణ్, బోడ చందర్, వెంకటి గంగారాం, హన్మంతు, దొంతుల నర్సింలు, రాజ్కుమార్, దివాకర్ తదితరులు ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఆర్థిక సహాయం పొందడానికి అర్హులైన ఎస్సీ కులాల విద్యార్థులు నవంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి పి.వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జపాన్, జర్మనీ దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే వారు జీఆర్ఈ, జీమ్యాట్ లేదా టోఫెల్, ఐఈఎల్టీఎస్ల అర్హత స్కోర్తో పాటు, డిగ్రీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలన్నారు. పూర్తి వివరాలకు తమ కార్యాలయంలో గానీ, తెలంగాణ ఈ–పాస్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చన్నారు.
నీటి సంరక్షణ పనుల పరిశీలన


