ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ట్రాన్స్కో షాక్
గాంధారి(ఎల్లారెడ్డి): ఇళ్లు లేని పేదవారు ఇళ్లు నిర్మించుకోవాలని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఐదు రూ.లక్షలు ఇస్తోంది. గ్రామాల్లో పురాతన పెంకుటిళ్లు, శిథిలమైన ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారు. అర్హులైన వారందరూ ఇళ్లు నిర్మించుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తూ సహకరిస్తున్నారు. అయితే ట్రాన్స్కో శాఖ అధికారులు మాత్రం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు షాక్ ఇస్తున్నారు. ముదెల్లి గ్రామానికి చెందిన వడ్నాల హన్మాండ్లు భార్య శిరీష పేరున ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. పాత ఇల్లును కూల్చి వేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇల్లు సెంట్రింగ్ స్థాయికి వచ్చింది. అయితే పాత ఇంటికి ఉన్న విద్యుత్తు మీటరును పక్కన ఏర్పాటు చేసుకుని వాడుకుంటున్నారు. ట్రాన్స్కో అధికారులు తనిఖీ చేసి పాత మీటరు కేటగిరీ–1లో ఉందని.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి కేటగిరీ–2లోకి మార్చుకోవాలని ట్రాన్స్కో అధికారులు సూచించారు. తాము ఉచిత కరెంటు పథకంలో ఉన్నామని ఎందుకు మార్చుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నించారు. ట్రాన్స్కో అధికారులు అవేమి పట్టించుకోకుండా హన్మాండ్లుపై విద్యుత్తు చౌర్యం కేసు చేసి విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సంతకం లేకుండానే నోటీసు ఇచ్చారు. దీంతో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అవాక్కయ్యారు. ఈ విషయమై హన్మాండ్లు ట్రాన్స్కో అధికారులపై గాంధారి పోలీస్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. విద్యుత్ మీటరు హన్మాండ్లు తల్లి సత్తెవ్వ పేరు మీద, ఇందిరమ్మ ఇల్లు హన్మాండ్లు భార్య శిరీష పేరున మంజూరైంది. ట్రాన్స్కో అధికారులు హన్మాండ్లు మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అసెస్మెంటు ఫీజు రూ.6851తో పాటు కాంపౌండింగ్ ఫీజు రూ.1000 చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
పాత విద్యుత్తు మీటర్ల కేటగిరీ
మార్చుకోవాలని నిబంధన
మార్చుకోని వారిపై కేసుల నమోదు.. జరిమానా
ముదెల్లిలో ఇందిరమ్మ ఇంటి
లబ్ధిదారులపై కేసు నమోదు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ట్రాన్స్కో షాక్


