
సదరం సర్టిఫికెట్లు అందించాలి
భిక్కనూరు: దివ్యాంగులుగా ఉండి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందని వారిని గుర్తించి, వారికి సదరం సర్టిఫికెట్లు అందించాలని రాష్ట్ర సెర్ప్ డైరెక్టర్ గోపాల్ రావు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించారు. దివ్యాంగ విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా సిబ్బంది కృషి చేయాలని, వారికి ఆట వస్తువులు అందించాలని సూచించారు. దివ్యాంగ పెన్షన్లు పొందని వారికి పెన్షన్లు అందేలా చూడాలన్నారు. డీఆర్డీవో సురేందర్, డీపీఎం శోభారాణి, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, సీసీలు, దివ్యాంగ పునరావాస కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
నేడు కొత్త రేషన్కార్డుల పంపిణీ
బాన్సువాడ రూరల్: మండల కేంద్రంలోని రెడ్డి సంఘం ఫంక్షన్హాల్లో శనివారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేస్తారని తహసీల్దార్ వరప్రసాద్ తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ద్వారా లబ్ధిదారులకు సమాచారం అందించామని, సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి హాజరవుతారన్నారు.
కేంద్రీయ విద్యాలయం కోసం స్థల పరిశీలన
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఖాళీ స్థలాన్ని కేంద్రీయ విద్యాలయం కోసం కేటాయించడంతో రెవెన్యూ అధికారులు శుక్రవారం స్థలాన్ని సర్వే చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. స్థల కొలతలు తీసుకున్నామని తెలిపారు. మొత్తం నాలుగు ఎకరాల వరకు స్థలం ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఆర్ఐ శంకర్, పంచాయతీ కార్యదర్శి సందీప్, సర్వే అధికారులున్నారు.
పెద్ద చెరువు నీటి విడుదల
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి ఆయకట్టుకు నీటిని శుక్రవారం ప్రారంభించారు. పెద్ద చెరువు పరిధిలో గల గ్రామాల ఆయకట్టుకు నీటిని వదిలినట్లు రైతులు పేర్కొన్నారు. రైతులు చెరువు నీటిని వృథా చేయకుండా చూసుకోవాలని సూచించారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
బీబీపేట: ఇంటి చుట్టుపక్కల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో పూర్ణ చంద్రోదయ కుమార్ అన్నారు. శుక్రవారం ఫ్రైడే డ్రైడే సందర్భంగా బీబీపేటలో పలు కాలనీలను సందర్శించారు. ఇళ్లలోనిని నీటి కుండీలలో నిల్వ ఉన్న నీటిని పారబోశారు. దోమలు వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఆయన వెంట కార్యదర్శి రమేష్, ఆరోగ్య సిబ్బంది హరిప్రసాద్, ఆశా వర్కర్లు ఉన్నారు.
రాజంపేటలో..
రాజంపేట: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటిచుట్టూ, గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో బాలకృష్ణ అన్నారు. ఫ్రైడే డ్రైడేలో భాగంగా పొందూర్తి, శివాయిపల్లి గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరిగి నీటి నిల్వలు, త్రాగునీరు నిర్వహణ పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారి అపర్ణ, ఎంపీవో రఘురాం, తదితరులున్నారు.

సదరం సర్టిఫికెట్లు అందించాలి