ఎర్రవల్లి: వరిధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. మంగళవారం ఎర్రవల్లి మండలం తిమ్మాపురంలోని ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. ధాన్యంలో తేమశాతం, గింజల పరిమాణాన్ని కొలిచే విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి కేటాయించిన టార్ఫాలిన్లు, గన్నీబ్యాగులపై ఆరా తీశారు. నిర్దేశిత మిల్లులకు ధాన్యం రవాణా వివరాలను తెలుసుకున్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఐకేపీ డీపీఎం విమల, ఏఈఓ నరేశ్ ఉన్నారు.


