అలంపూర్: కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న ధాన్యం బస్తాలను తక్షణమే తరలించాలని ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు. అలంపూర్ చౌరస్తాలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం బస్తాలను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సమస్యలు లేకుండా చూడాలన్నారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షాల ముప్పు ఉందని తెలిసాన కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలను తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోవడంతో రైతులు తెచ్చిన ధాన్యం తూకాలు వేసి కొనుగోళ్లు చేయడం లేదన్నారు. కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలను తరలించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సీఎం రేవంత్రెడ్డి తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కనీసం రైతుల బాధలు పట్టించుకోని దుస్థితి ఉందన్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం కేంద్రాల్లోని ధాన్యం తరలించాలని, లేకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గజేందర్రెడ్డి, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.


