మానవపాడు: ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని డీఈలు రామ్పతి, నాగరాజు అన్నారు. శుక్రవారం మానవపాడు సమీపంలోని ఆర్డీఎస్–30 కెనాల్లో ఉపాధిహామీ పథకం కూలీలతో చేపట్టిన కంపచెట్లు, ముళ్లపొదల తొలగింపు పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులతో పాటు ఆయకట్టు రైతులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాల్వలో పూడికతీతతోనే సాగునీరు సాఫీగా పారుతుందని.. పూడికతీత పనులు చేపట్టాలని కోరారు. ఈ విషయంపై వారు స్పందిస్తూ.. ఆయకట్టు రైతులు, రైతు సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా పూడిక తీసుకునేందుకు అనుమతులు ఇస్తామన్నారు. లేనిచో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనప్పుడు పూడికతీత చేపడుతామని స్పష్టంచేశారు. ఉపాధి హామీ పథకంలో పూడికతీత పనులు చేపడితే.. మళ్లీ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేందుకు రెండు, మూడేళ్ల సమయం పడుతుందని రైతులకు వివరించారు. కాల్వలో పూడికతీత కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో తీర్మానంచేసి సమర్పించాలని సూచించారు. వారి వెంట సర్పంచ్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు.


