నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
గద్వాలటౌన్: గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల నుంచి స్వీకరించే నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. రెండో విడత ఎన్నికలలో భాగంగా ఆదివారం మల్దకల్ మండలంలోని మల్దకల్ –1, మల్దకల్–2, పెద్దపల్లి, అమరవాయి క్లస్టర్ గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియతో పాటు ఆయా పంచాయతీలలో ఉన్న ఓటర్ల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు తమ దరఖాస్తుకు జతపర్చాల్సిన వయసు, కుల, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను నిబంధనల ప్రకారం స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ల డిపాజిట్ను స్వీకరించిన వెంటనే రషీదును అందజేయాలన్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు ప్రతిపాదించే ఇద్దరినీ మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో ఉండే అన్ని అంశాలను అభ్యర్థులు కరెక్టుగా పూరించేలా అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియామళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.


