కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ ఆందోళన

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టిన బీజేపీ నాయకులు  - Sakshi

గద్వాల: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై శనివారం బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. మొదట పార్టీ కార్యాలయం నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సుమారు గంటపాటు ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని తీవ్రమైన అంశంగా పరిగణించి సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన అభ్యర్థులకు రూ.లక్ష నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. పేపర్‌ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ.. మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతోనే ఇలాంటివి మళ్లీ జరుగుతున్నాయని విమర్శించారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని కమిషన్‌ ఎందుకని నిలదీశారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ అపూర్వ్‌ చౌహన్‌కు వినతి అందజేశారు. నైతిక బాధ్యత వహిస్తూ.. టీఎస్సీపీఎస్‌ చైర్మన్‌ తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకులు రామాంజనేయులు, రవికుమార్‌, బండల వెంకట్రాములు, వెంకటేశ్వర్‌రెడ్డి, జయశ్రీ, ఆనంద్‌, రాజగోపాల్‌, శ్రీరాములు పాల్గొన్నారు.

Read latest Jogulamba News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top