రేగొండ: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు సురక్షితమని, తగిన పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో జరుగుతున్న ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు రక్తహీనత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లి పాలు పట్టించాలని, శిశువులకు వ్యాధులు సోకకుండా ఉండేందుకు వ్యాధినిరోధక టీకాలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఓ ఎంసీహెచ్ డాక్టర్ శ్రీదేవి, మండల వైద్యాధికారిణి హిమబిందు, ఆశకార్యకర్తలు, గర్భిణులు పాల్గొన్నారు.
సింగరేణిని కాపాడేందుకు
ఏకం కావాలి
భూపాలపల్లి అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తోందని, కార్మిక లోకం ఏకమై సింగరేణిని కాపాడుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం ఏరియాలోని కేటీకే–1వ గనిలో నిర్వహించిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, మెడికల్ అన్ఫిట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు పెరగడం వల్ల సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఈ నెల 12న మాజీ మంత్రి హరీశ్రావు భూపాలపల్లిలో నిర్వహించనున్న సమావేశానికి సింగరేణి కార్మికులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అధికారుల తనిఖీ
మల్హర్(కాటారం): కాటారం మండల పరిధిలోని ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల విక్రయ కేంద్రాలపై మంగళవారం టాస్క్ఫోర్స్, రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. లక్ష్మీగణపతి ట్రేడర్స్, శ్రీ రాజరాజేశ్వర అగ్రిమాల్ షాపులను క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణాల్లోని రికార్డులు, పత్తి విత్తనాల నిల్వలు (స్టాక్స్), వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు, డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను విక్రయించాలన్నారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


