ప్రతీ పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యం
● హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్సింగ్
● కోర్టు భవనానికి వర్చువల్గా శంకుస్థాపన
భూపాలపల్లి అర్బన్: ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే న్యాయస్థానాల లక్ష్యమని హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్సింగ్ అన్నారు. జిల్లాలో నిర్మించ తలపెట్టిన 10+2 కోర్ట్ భవనానికి శనివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ ప్రసంగించారు. పౌరుడి ప్రాథమిక హక్కుల పరిరక్షణే ధ్యేయం కావాలన్నారు. వ్యవస్థలోని అన్ని వర్గాల సహకారం, వనరుల లభ్యత న్యాయ వ్యవస్థకు ఉందన్నారు. అంతకుముందు కేటీకే 6వ గని సమీపంలో కోర్టు భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ ఎన్.రాజేశ్వర్రావు హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్.రమేష్బాబు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, బార్ అసోసియేషన్ సభ్యులు హైకోర్ట్ న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పునాది రాయి వేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈవీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. జిల్లాకు న్యాయస్థాన భవన సముదాయం మంజూరు కావడం ఆనందించదగిన విషయమన్నారు. కొత్త కోర్టు ఏర్పాటు అనేది సిబ్బందికి, న్యాయవాదులు, కక్షిదారులకు ఎంతో ఉపయోగకరమన్నారు. జిల్లాలో కోర్టు ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు. జస్టిస్ ఎన్.రాజేశ్వర్రావు మాట్లాడుతూ.. కోర్టు భవనాలు న్యాయ దేవాలయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్కుమార్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్రావు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనితావని, న్యాయవాదులు పాల్గొన్నారు.


