జనగామ రూరల్: ఈనెల 7వ తేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కడియం శ్రీహరి నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పర్యటనపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ..రూ.50 కోట్లతో 7 విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని వేలేరు మండలం, పీచర గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని, చిల్పూర్ మండలం, కొండాపూర్, జఫర్గఢ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో 33/11 కేవీ ఉప కేంద్రాలను ప్రారంభించనున్నారన్నారు. చిల్పూర్ మండలంలో 33/11 కేవీ లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేయనున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయ వంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యటనలో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో ఆర్డీఓ వెంకన్న, డీఏఓ అంబికా సోనీ, జెడ్పీ సీఈఓ రంగారావు, ఏబీసీడీఓ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవి లత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, విద్యుత్ శాఖ అధికారి సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పల్లగుట్టలో సభ ఏర్పాట్ల పరిశీలన
చిల్పూరు: మండలంలోని పల్లగుట్టలో ఈనెల 7న జరగనున్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క బహిరంగ సభ ప్రాంతాన్ని ఎమ్మెల్యే కడియం పరిశీలించారు. చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి, అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొదట జఫర్గడ్ మండల కేంద్రంలో బహిరంగ సభ అనుకున్నప్పటికీ దాన్ని పల్లగుట్ట గ్రామంలో 5 వేల మందితో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సర్పంచ్లు శాతబోయిన రాజు, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీఓ రఘురామకృష్ణ, ట్రాన్స్కో అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటనపై ఎమ్మెల్యే కడియం, కలెక్టర్ సమీక్ష
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం


