
పక్కాగా ఫీవర్ సర్వే నిర్వహించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. 100 రోజుల టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్లో భాగంగా టీబీ బారిన పడిన వారిని, వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఎలా గుర్తిస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆశవర్కర్లకు ఫీవర్ సర్వేపై పలు సూచనలు చేశారు. 13వ వార్డులో జరుగుతున్న ఫీవర్ సర్వేను పరిశీలించి జ్వరం, దగ్గు, ఒంటి నొప్పుల వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి అవసరమైన పరీక్షలు, వైద్యసేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి శ్రీతేజ, సూపర్వైజర్ రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే మెరుగైన విద్య
ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఇంటర్ అడ్మిషన్లపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్రెడ్డి, ప్రిన్సిపాల్స్, డీఈఓ భోజన్న, అధికారులు పాల్గొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. మున్సిపాలిటీలోని 21 వార్డు కుర్మవాడలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పరిశీలించారు. అలాగే పట్టణంలోని ధర్మకంచ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు మార్గదర్శకులు కావాలన్నారు.