ముగిసిన హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మూడు రోజులపాటు నిర్వహించి న పెద్ద జయంతి ఉత్సవాలు మంగళవారం సా యంత్రం ముగిశాయి. మూలవిరాట్టుకు పట్టు వస్త్రాలంకరణ, విశేష అభిషేకం, హోమం, మహాపూర్ణాహుతి, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం సామూహిక విష్ణు సహస్ర పారాయణం, అమ్మవారికి కుంకుమార్చన, ఒడి బియ్యం, సహస్ర దీపాలంకరణ, గరుడ వాహన సేవ, కంకణోద్వాసన, మంత్రపుష్పం, మహాదాశ్వీరాదం, తీర్థ, ప్రసాద వితరణ నిర్వహించారు. అర్చకులు, ఆలయ అధికారులు యాగశాల నుంచి ఉత్సవ మూర్తులను మేళతాళాల మధ్య ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ ఈఓ అంజనా రెడ్డి, ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్‌, రామకృష్ణ, రఘు, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, స్థానా చార్యులు కపీందర్‌, ఏఈవో హరిహరనాథ్‌, సూపరింటెండెంట్‌ సునీల్‌ కుమార్‌, చంద్రశేఖర్‌, అశోక్‌, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

నర్స్‌ల సేవలు మరువలేనివి

జగిత్యాల: నర్స్‌ల సేవలు మరువలేనివని మెడికల్‌ కళాశాల సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాలలో సీనియర్‌ సిటిజన్స్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్స్‌ల దినోత్సవం నిర్వహించారు. రోగులకు వారి సేవలు అమోఘమని, రోగం నయం అయ్యేవరకూ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. అనంతరం విశిష్ఠ సేవలందించిన 12 మందిని సత్కరించారు. కార్యక్రమంలో శ్రీపతి, నరేశ్‌, రాజ్‌గోపాల్‌ పాల్గొన్నారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి

విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి

జగిత్యాలరూరల్‌: వానాకాలం పంటలు సాగు చేసే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో వానాకాలం సీజన్‌ విత్తనాలపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. రైతులు విత్తనం కొనుగోలు చేసే ముందు నాణ్యతప్రమాణాలు చూసుకోవాలని, తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్‌, రీజినల్‌ మేనేజర్‌ విష్ణువర్దన్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారులు, ప్రాథమిక సహకార సంఘాల సీఈవోలు, డీసీఎంఎస్‌ సీవోలు, ఆగ్రోస్‌ రైతు సేవ సంఘం డీలర్లు పాల్గొన్నారు.

మిల్లర్ల దోపిడీ అరికట్టాలని రైతుల ధర్నా

41 కిలోలకు బదులు 43 కిలోలు తూకం వేస్తున్నారని ఆగ్రహం

మెట్‌పల్లిరూరల్‌: రైస్‌మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ మెట్‌పల్లి–కోరుట్ల జాతీయ రహదారిపై రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. మెట్‌పల్లి మండలం కోనరావుపేట క్రాసింగ్‌ వద్ద గంటపాటు బైఠాయించారు. ధాన్యాన్ని 41 కిలోలకు బదులు 43 కిలోలు తూకం వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు అక్కడికి చేరుకోగా.. తూకంలో జరుగుతున్న మోసాన్ని ఆయనకు వివరించారు. సమస్య పరిష్కరిస్తామని ఆయన చెప్పడంతో ఆందోళన విరమించారు.

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు 20 మంది ఎంపిక

మెట్‌పల్లి: పట్టణంలోని మినీ స్టేడియంలో మంగళవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించారు. అండర్‌–8, 10, 12, 14 విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 20మందిని ఈ నెల 17న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి తెలిపారు. పీఈటీ కొమురయ్య, సీనియర్‌ అథ్లెట్‌ వెంకటేశ్వర్లు, గజెల్లి రాందాస్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement