మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయం కాషాయమయమైంది. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా కొనసాగాయి. ఉదయం 9 గంటలకు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్థాపిత దేవతారాధన నిర్వహించారు. హోమం, సుందరకాండ పారాయణం, పంచామృత అభిషేకం, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, అమ్మవారి కుంకుమార్చన, పుష్పాలతో సహస్రనామార్చన, హోమం, బలిహరణము, మహానివేదన నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు కపిందర్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, వకుళాభరణం రఘు, జితేందర్ ప్రసాద్, వేదపండితులు పెద్దన్న శర్మ, రాజేశ్వర శర్మ, హరిబాబు శర్మ పాల్గొన్నారు.


