చైనాను ఢీకొట్టేందుకు దిగ్గజ దేశాల కలయిక
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యాన్ని ఢీకొట్టేందుకు దిగ్గజ దేశాలు( భారత్, ఆస్ట్రేలియా, జపాన్) కలిసి పనిచేయనున్నట్లు ఓ నివేదిక తెలిపింది. కాగా మూడు దేశాల సమన్వయం కోసం జపాన్కు చెందిన హిరోషి కాజియామా, భారత్ తరపున పీయూష్ గోయల్, ఆస్ట్రేలియా తరపున సైమన్ బిర్మంగమ్ మంగళవారం వీడియో కాన్పరెన్స్లో మాట్లాడారు. కాగా చైనాతో భౌగోళిక సరిహద్దులు, ఉద్రిక్తతల నేపథ్యంలో కలిసి పనిచేయనున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా, క్వాడ్రిలాటరల్ భద్రతా ఒప్పందంలో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.
కాగా, నూతన సాంకేతికత కోసం మూడు దేశాలు కలిసి పనిచేయనున్నాయని, తమ విధానాలు నచ్చితే ఏ దేశమైనా తమతో కలిసి పనిచేయవచ్చని దేశాల ప్రతినిథులు పేర్కొన్నారు. ప్రస్తుతం తయారీ రంగంలో అత్యధిక ఎగుమతులను చైనా చేస్తుంది. మరవైపు ఫార్మాకు కావాల్సిన ముడిసరుకులను ప్రపంచ దేశాలకు చైనా నుంచే ఎగుమతి అవుతున్నాయి. అయితే వాణిజ్యపరంగా చైనాను ఢీకొట్టాలంటే పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.