వెల్లడించిన ఆస్ట్రేలియా బయోటెక్ కంపెనీ
మెల్బోర్న్: కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని ఒణికిస్తోంది. పేద, ధనిక, సెలబ్రెటీ, సామాన్యులు అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తోంది. కోవిడ్ దెబ్బకు ప్రపంచ పురోగతి ఓ దశాబ్దం వెనకపడింది. మహామ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈలోగా పలు సంస్థలు కరోనాను కట్టడి చేసే మార్గాల గురించి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఓ మంచి వార్త చెప్పారు. జలుబు నుంచి ఉపశమనం కోసం వాడే నాసల్ స్ర్పేతో కరోనాకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు. ఆస్ట్రేలియా బయోటెక్ కంపెనీ ఎనా రెస్పిరేటరీ జంతువుల మీద చేసిన ప్రయోగాల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నాసల్ స్ప్రే వాడకంతో కరోనా వైరస్ పెరుగుదలని గణనీయంగా తగ్గించవచ్చని వెల్లడించారు.
ఈ మేరకు ఫెర్రెట్స్ మీద వ్యాక్సిన్కి బదులుగా ఐఎన్ఎన్ఏ-051 ఉత్పత్తిని ప్రయోగించారు. ఇది కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ స్థాయిలను 96 శాతం వరకు తగ్గించిందని కంపెనీ తెలిపింది. బ్రిటీష్ ప్రభుత్వ సంస్థ పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించింది. ఈ క్రమంలో మరో నాలుగు నెలల్లో ఐఎన్ఎన్ఏ-051ను మానువుల్లో పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎనా రెస్పిరేటరీ తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు, రెగ్యూలేటరీ అప్రూవల్స్కు లోబడి ఈ పరీక్షలు చేస్తామని తెలిపారు. ఇక ఈ నాసల్ స్ప్రే అభివృద్ధి కోసం కంపెనీ 11.7 మిలియన్ డాలర్ల (24 8.24 మిలియన్) ని సమీకరించింది. పెట్టుబడిదారులలో వెంచర్ క్యాపిటల్ సంస్థ బ్రాండన్ క్యాపిటల్ లిమిటెడ్, ఆస్ట్రేలియన్ ఫెడరల్ గవర్నమెంట్, పెన్షన్ ఫండ్స్ అండ్ బయోటెక్ దిగ్గజం సీఎస్ఎల్ లిమిటెడ్ ఉన్నాయి. (వ్యాక్సిన్: రూ. 80 వేల కోట్లు ఉన్నాయా?)
ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు కరోనావైరస్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడి 9,92,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ -19 వ్యాక్సిన్లను పొందటానికి కొన్నిఔషధ కంపెనీలతో ఆస్ట్రేలియా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 875 మరణాలు, కేవలం 27,000 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూస్తే ఇక్కడ నమోదైన కేసులు చాలా తక్కువ అనే చెప్పవచ్చు. (చదవండి: రష్యా నుంచి రెండో కరోనా వ్యాక్సిన్)