కేయూ క్యాంపస్: గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) లో ఈనెల 8,9వ తేదీల్లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో కాకతీయ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ ఆచార్య బి. వెంకట్రామ్రెడ్డి పాల్గొని ప్రతిభ చాటారు. ‘ఇంటర్నేషల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎమర్జింగ్ మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ అండ్ డివైసెస్ ఫర్ సస్టేయినబుల్ టెక్నాలజీస్’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇది దేశ, విదేశాలనుంచి హాజరైన శాస్త్రవేత్తలు,అధ్యాపకులు, పరిశోధకుల నుంచి ప్రశంసలు అందుకుంది. సుస్థిర సాంకేతికతకు అవసరమైన బహుళ విధుల పదార్థాలు, పరికరాలపై ప్రపంచవ్యాప్తంగా జరగుతున్న పరిశోధనలకు ఈ వేదికపై చర్చించారు. కాగా, నిర్వాహకులు వెంకట్రామ్రెడ్డిని సన్మానించి జ్ఞాపిక అందజేశారు. అలాగే, మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ వేదాంతం సుబ్రహ్మణ్యం వేదాంతం కూడా జ్ఞాపిక అందజేసి అభినందించారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆచార్య వెంకట్రామ్రెడ్డిని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం అభినందించారు.


