స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
వరంగల్ క్రైం : స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా.. ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ శనివారం కాజీపేట ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయ సిబ్బంది అధికారులు సీపీకి పూలమొక్కను అందజేసి స్వాగతం పలకగా, సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయ పరిసరాలు, స్పెషల్ గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ పెండింగ్ కేసులతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నిబంధనలను అతిక్రమించే వారిపై అలసత్వం వహించొద్దని సీపీ పోలీసు అధికారులకు సూచించారు. సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు పుల్యాల కిషన్, సుధాకర్ రెడ్డి, చేరాలు, శ్రీధర్ రావు, రమేష్ పాల్గొన్నారు.
కాజీపేట : కాజీపేటలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో (ఐటీఐ) ఈ నెల 12న జాతీయ మెగా అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్లతో పాటు అన్ని ట్రేడ్ల అభ్యర్థులు మేళాకు హాజరు కావాలని కోరారు. బయోడేటా, అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ, పదో తరగతి, ఐటీఐ మెమో, ఎన్టీసీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. www.apprenticeshipindia. gov.in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగుల ముఖగుర్తింపు (ఎఫ్ఆర్ఎస్) హాజరును త్వరలోనే అమలు చేయబోతున్నారు. దీంతో ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను శనివారం యూనివర్సిటీలోని పరిపాలన భవనంలో ప్రారంభించగా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం పర్యవేక్షించారు. విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కార్యాలయాలు, విద్యావిభాగాలు ఆఫీసుల్లో ఈ ప్రక్రియను కొనసాగిస్తామని రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. ఈనెల 8న కూడా వివిధ విభాగాల ఉద్యోగులకు నమోదు ప్రక్రియ కొనసాగనుందని వివరించారు.
కాజీపేట అర్బన్ : భీమదేవరపల్లిలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కపిల్ ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడగా జిల్లా రిజిస్ట్రార్ ప్రవీన్కుమార్ శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడడంతో షోకాజ్ నోటీ సు అందజేసి కొడకండ్లకు బదిలీ చేశారు.
హసన్పర్తి: హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సీతంపేట ఉపకేంద్రాన్ని శనివారం హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపకేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. వ్యాక్సిన్ రికార్డులను సరిచూశారు. గర్భిణుల నమోదును అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.


