వాడీవేడి చర్చ
రసాభాసగా గ్రేటర్ కౌన్సిల్ సమావేశం
వరంగల్ అర్బన్: జిల్లా ఇన్చార్జ్ మంత్రి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం జారీ చేసిన ఉత్తర్వులను 8 నెలల క్రితం పట్టించుకోలేదని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ ఉత్తర్వులను ముక్కలుగా చించేసి మేయర్, కమిషనర్, అధికారులపై ఎమ్మెల్సీ అక్కసు వెళ్లగక్కారు. గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన సోమవారం బల్దియా కార్యాలయంలో రసాభాసగా సాగింది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కేంద్ర బిందువుగా చర్చ గరంగరంగా సాగింది. ముందుగా కవి అందెశ్రీ, మాజీ కౌన్సిలర్ బైరి సాంబయ్య మృతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడు తున్న టౌన్ప్లానింగ్ అధికారులు పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 39 ఎజెండా అంశాలు, రూ.130 కోట్ల అభివృద్ధి పనులపై తీర్మానాలు ఆమోదించారు. కాగా, పాలకవర్గం 55 నెలల కాలంలో పెద్ద మొత్తం నిధులతో మొదటిసారి తీర్మానించడం చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్సీకి గౌరవం లేదా?
ఎజెండా అంశాలను చదువుతుండగా ఎమ్మెల్సీ సారయ్య జోక్యం చేసుకుని.. ‘నేను కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. మంత్రిగా పనిచేశా. ఎమ్మెల్సీని అయిన నాపై అధికారులకు ఏ మాత్రం గౌరవం లేదు. హంటర్రోడ్డులో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జారీచేసిన ఉత్తర్వులు 8 నెలల క్రితం సమర్పించినా పట్టించుకోలేదు. కనీసం ఫోన్ ఎత్తడం లేదు’ అంటూ మండిపడ్డారు. కమిషనర్ చాహత్బాజ్పాయ్ మాట్లాడుతూ.. అన్ని కమ్యూనిటీ హాళ్లను బల్దియా స్వాధీనం చేసుకొని నిర్వహణ బాధ్యతలు తీసుకుంటుందని సమాధానమిచ్చారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. బల్దియా స్థలాలను సామాజిక అవసరాలకు కేటాయించిన నిధులతో కమ్యూనిటీహాళ్లు నిర్మించినట్లు తెలిపారు. అన్ని కులాలు, ఆలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించి నిర్మించిన కమ్యూనిటీహాళ్ల నిర్వహణ బల్దియాకు ఎలా సాధ్యమవుతుందని మండిపడుతూ ఉత్తర్వులను చించిపడేశారు. ఫెన్సింగ్ వేయకపోవడంతో ఖాళీ స్థలాలు కబ్జాకు గురవుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన వాహనాన్ని అడ్డుకున్నారని, కార్పొరేటర్లను ఫొటోలు తీసి పంపిస్తున్నారని మేం ఏమైనా మావోయిస్టులమా? అని ప్రశ్నించారు. పోలీసులు బల్దియా కౌన్సిల్హాల్ సమీపంలో ఉండకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ హామీ ఇచ్చారు. అంతకుముందు సమావేశానికి రాకముందే ఆవరణలో తన వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో మట్టెవాడ సీఐని ఎమ్మెల్సీ మందలించారు.
అధికారుల తీరుపై
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గరంగరం
టౌన్ ప్లానింగ్ వ్యవహారాలపై
ఎమ్మెల్యే నాయిని అసహనం
రూ.135 కోట్ల అభివృద్ధి పనులకు తీర్మానం


