చంద్రబాబు కోసం ఈనాడు బరితెగింపు
గుంటూరు రూరల్: చంద్రబాబు కోసం ఈనాడు రామోజీరావు బరితెగించి రాతలు రాస్తూ అబద్ధ్దపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఈనాడులో పట్టాభి పాత ఫొటోలతో వచ్చిన కథనాలకు నిరసనగా ఈనాడు పేపర్లను శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు కోసం ఈనాడు, రామోజీరావు కనీస నైతిక విలువలు మరిచారని చెప్పారు. అబద్ధపు ప్రచారాలు, రోత పుట్టించే రాతలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఎల్లో మీడియా అబద్ధపు ప్రచారాలు చేస్తోందని పేర్కొన్నారు. పప్పు లోకేష్ మాట్లాడే మాటలు నీకు వినిపించవా రామోజీ అని ప్రశ్నించారు. పేజీల కొద్ది బురద రాతలు రాస్తే ప్రజలు గమనిస్తూనే ఉన్నారని నీ అబద్ధాలకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
తల్లకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబును సీఎం చేయలేరని, లోకేష్ పప్పు అని ప్రజలు ఇప్పటికే డిసైడయ్యారని పేర్కొన్నారు. కేవలం ఒక వర్గాన్ని కాపాడుకునేందుకు చంద్రబాబు కోసం దిగజారిపోయి తప్పుడు రాతలు రాస్తున్నరని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు దింపుడు కల్లం ఆశ మాత్రమే ఉందని గమనించి ఎలాగైనా టీడీపీని భుజాన వేసుకుని పైకి లేపాలని ప్రయత్నిస్తున్నారని ప్రజలు గమనించారని రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు, నీకు తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు. కేవలం బూతులు తిట్టేందుకు పట్టాభిని ముందుకు నెట్టి చంద్రబాబు చోద్యం చూస్తున్నాడని టీడీపీలోని నాయకులే అంటున్నారని చెప్పారు. తప్పులు చేసి చివరికి తప్పు అయిపోయిందని రాసుకునే హీన స్థితికి దిగజారావంటే నిన్ను చంద్రబాబు ఎంత హీన స్థితికి దిగజార్చాడో అర్థం చేసుకోవాలని కోరారు. డౌన్ డౌన్ రామోజీ, రోత రాతల రామోజీ, ఈనాడు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, చైర్మన్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.