యువ | Young people to society and promotes their active participation in global development | Sakshi
Sakshi News home page

యువ

Aug 12 2025 12:52 AM | Updated on Aug 12 2025 12:52 AM

Young people to society and promotes their active participation in global development

నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం

వీరు సామాన్యులు కారు. నెత్తురు మండే, శక్తులు నిండే యువ సైనికులు.  రానీ, రానీ వస్తే రానీ కష్టాల్, నష్టాల్‌ అంటూ లక్ష్యం వైపు దూసుకెళ్లి విజయకేతనం  ఎగరేసిన ధీర యువత. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రంగాలలో ‘నంబర్‌వన్‌’గా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు ఈ యువ మహిళలు...

ఆరోగ్యం
ఆరోగ్యం... మన దేశంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో రుతుస్రావ కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. పేదరికం వల్ల ఎంతోమంది రుతుక్రమ పరిశుభ్రత (మెనుస్ట్రువల్‌ హైజీన్‌)కు సంబంధించిన సౌకర్యాలకు దూరం అవుతున్నారు. సౌకర్యాల లేమీ వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సౌమ్య డబ్రీవాల్, ఆరాధన రాయ్‌ గుప్తా సోషల్‌ ఎంటర్‌ప్రైజ్‌ ప్రాజెక్ట్‌ ‘బాల’కు శ్రీకారం చుట్టారు.

 ‘బాల’ ద్వారా పేదింటి మహిళలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన మెనుస్ట్రువల్‌ ప్రాడక్ట్స్‌ను అందిస్తున్నారు. మన దేశంలోని 28 రాష్ట్రాలతో  పాటు నేపాల్, ఘనా, టాంజానియా దేశాలలో ‘బాల’ ఉత్పత్తులను అమ్ముతున్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ వార్‌విక్‌లో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేస్తున్న రోజుల్లో సౌమ్యకు ‘బాల’ ఆలోచన వచ్చింది. తన చిన్ననాటి స్నేహితురాలు, కార్నెల్‌ యూనివర్శిటీలో ఎంబీఏ చేస్తున్న ఆరాధనా రాయ్‌ గుప్తాతో కలిసి తన ఆలోచనను పట్టాలకెక్కించి విజయం సాధించింది

అందం
అందం... ‘శాంతి బనారస్‌’ బ్రాండ్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఖుషీ షా. బనారస్‌ (వారణాసి)లో పుట్టి పెరిగిన ఖుషీకి నేత ప్రపంచం గురించి తెలియని విషయం అంటూ లేదు. ‘చిన్న వయసులోనే మార్కెటింగ్‌ పల్స్‌ పట్టుకున్నాను’ అని నవ్వుతూ చెప్పే ఖుషీ న్యూయార్క్‌లోని ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎఫ్‌ఐటీ)లో చదువుకుంది. గ్లోబల్‌ మార్కెట్, టెక్స్‌టైల్‌కు సంబంధించి సాంకేతిక విషయాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఆ చదువు ఖుషీకి ఉపయోగపడింది.

 ‘శాంతి బనారస్‌’ కాన్సెప్టువలైజేషన్, బ్రాండ్‌ ఐడెంటిటీ డెవలప్‌మెంట్, మార్కెటింగ్‌లలో ఖుషీ కీలక  పాత్ర  పోషించింది. సంప్రదాయ బనారస్‌ చీరలకు భిన్నంగా తమ బ్రాండ్‌ను తీర్చిదిద్దింది. ‘రియల్‌ జరీ’ కాన్సెప్ట్‌తో ‘శాంతి బనారస్‌’ బ్రాండ్‌ను విజయవంతం చేసింది. చీరె కొన్నవారికి ‘అథెంటిసిటీ సర్టిఫికెట్‌’ ఇచ్చే విధానానికి రూపకల్పన చేసింది.

సాంకేతికం
సాంకేతికం... టెక్‌ ప్రాడక్ట్స్‌కు సంబంధించి డిజైనింగ్, విజువలైజేషన్‌లో చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్న సిమౌల్‌ ఆల్వా ఫైనాన్షియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ కంపెనీ ‘రిపుల్‌’లో విజువల్‌ డిజైన్‌ టీమ్‌కు నాయకత్వం వహిస్తోంది. సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ పెరిగిన ఆల్వాకు ఊహలకు ఉండే శక్తి ఏమిటో అనుభవంలోకి వచ్చింది. 

‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌’ స్టూడెంట్‌గా అబుదాబీలో జరిగిన ‘వరల్డ్‌స్కిల్స్‌ కాంపిటీషన్‌’లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది. ΄్యాకేజింగ్‌ డిజైన్, ఎడిటోరియల్, విజువల్‌ ఐడెంటిటీకి సంబంధించి ముప్పై దేశాలకు చెందిన విద్యార్థులతో  పోటీపడి ఆల్వా విజేతగా నిలిచింది. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ క్రియేటివ్‌ ఏజెన్సీ ‘అండ్‌ వాల్ష్‌’లో క్రియేటివ్‌ డైరెక్టర్‌ జెసికా వాల్ష్‌ బృందంతో పనిచేసే అవకాశం ఆల్కాకు వచ్చింది.

 ‘అండ్‌ వాల్ష్‌’లో పర్యావరణహిత సంస్థ ‘గెల్టర్‌’కు సంబంధించిన ప్రాజెక్ట్‌ను లీడ్‌ చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అమెజాన్, యాపిల్, ఆడోబ్‌లాంటి దిగ్గజ సాంకేతిక సంస్థల ప్రాజెక్ట్‌లు చేసింది. ‘ఎలాంటి పరిమితులు లేకుండా విశాల దృష్టితో ఆలోచిస్తూ ప్రాజెక్ట్‌లను విజయవంతం చేస్తోంది. అంకితభావానికి సృజనాత్మకత తోడైతే వచ్చే శక్తి ఏమిటో ఆమె పని విధానంలో కనిపిస్తుంది’ అని ఆల్కాను ప్రశంసించారు ‘అండ్‌ వాల్ష్‌’ ఫౌండర్, క్రియేటివ్‌ డైరెక్టర్‌ జెస్సిక వాల్ష్‌.

సామాజికం
సామాజికం... ‘కంటెంట్‌ క్రియేటర్‌’ అంటే కాలక్షేప కంటెంట్‌ క్రియేటర్‌లు మాత్రమే కాదని నిరూపించింది కావ్య కర్నాటక్‌. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోగ్య, నీటి,  పారిశుధ్య సమస్యలను వెలుగులోకి తీసుకువస్తోంది. తన యూట్యూబ్‌ చానల్‌ ‘కేకే క్రియేట్‌’ ద్వారా సంప్రదాయ మార్గాన్ని తోసిరాజని ‘ఇలా కూడా కంటెంట్‌ క్రియేట్‌ చేయవచ్చు (అని నిరూపించింది కావ్య. ఎన్నో సామాజిక సమస్యలపై ఇన్వెస్టిగేటివ్‌ స్టోరీలు చేసింది. 

ఆమె చానల్‌కు రెండు మిలియన్‌ల సబ్‌స్రైబర్‌లు ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని నైనితాల్‌కు చెందిన కావ్య కర్నాటక్‌ ‘టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌’లో మీడియా అండ్‌ కల్చర్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. అక్కడ చదువుతున్న రోజుల్లోనే ముంబై ఆరే ఫారెస్ట్, ఆదివాసీ తెగలపై డాక్యుమెంటరీ తీసింది. కావ్య, ఆమె బృందం కెమెరాలతో దిల్లీలోని ఘాజీపూర్‌లో అతిపెద్ద చెత్తడంప్‌ను చిత్రీకరిస్తున్నప్పుడు వారిపై దాడి జరిగింది. ఇలాంటి దాడులు ఎన్నో జరిగినా కావ్య వెనక్కి తగ్గలేదు. అదే ఆమె బలం.

వినోదం
వినోదం... ‘హాస్యాన్ని సీరియస్‌గా తీసుకోండి. నవ్వితే వ్యాయామం చేసినట్లే’ అంటున్న కరిష్మ గంగ్వాల్‌ కామెడీ కంటెంట్‌ క్రియేటర్‌గా డిజిటల్‌ ప్రపంచంలో వేలాది మంది అభిమానులను సం పాదించుకుంది. ‘ఆర్‌జే కరిష్మ’గా  పాపులర్‌ అయిన కరిష్మ కామెడీకి ముడిసరుకు... రోజూ తాను చూసే వ్యక్తులు, తొంభైల నాటి టీవీ సీరియల్‌ క్యారెక్టర్లు. 

చుట్టూ ఉన్న నలుగురిని నవ్వించడం కరిష్మాకు కొత్త కాక పోయినప్పటికీ ఎంటరైన్‌మెంట్, కామెడీ తన కెరీర్‌ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. డిగ్రీ పూర్తయిన తరువాత రేడియోలో ప్రోగ్రామ్స్‌ చేసిన కరిష్మ కోవిడ్‌ కాలంలో సోషల్‌ మీడియాలోకి అడుగుపెట్టి కామెడీ కంటెంట్‌ క్రియేటర్‌గా మారింది. తొలిసారిగా ఒక వినోదాత్మకమైన వీడియో చేసి తన చెల్లికి చూపించింది. అత్తా–కోడళ్ల హాస్యంపై చేసిన ఆ వీడియోను చూసిన కరిష్మ చెల్లెలు నాన్‌స్టాప్‌గా నవ్వింది. 

సోషల్‌ మీడియాలో  పోస్ట్‌ చేసిన ఆ వీడియోకు మూడు రోజుల వ్యవధిలోనే 1.3 మిలియన్‌లు వ్యూస్‌ వచ్చాయి. ‘కామెడీ కంటెంట్‌ కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. మన ఇంట్లోనే ఎంతో కంటెంట్‌ దొరుకుతుంది. వీధిలో అలా నడుచుకుంటూ వెళ్లినప్పుడు వినిపించే మాటల నుంచి కూడా కంటెంట్‌ పుడుతుంది’ అంటున్న ఆర్జే కరిష్మాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6.4 మిలియన్‌ల ఫాలోవర్‌లు ఉన్నారు. స్ప్రైట్, డీటీడీసీ, అమెజాన్‌ డాట్‌లాంటి ప్రసిద్ధ బ్రాండ్‌లతో కలిసి పనిచేస్తోన్న కరిష్మ గంగ్వాల్‌ ‘ఫోర్బ్స్‌ ఆసియా 30 అండర్‌ 30’ జాబితాలో చోటు సాధించింది.

ఆత్మవిశ్వాసం
ఆత్మవిశ్వాసం... ఆ  పోటీకి ముందు ప్రీతి  పాల్‌ మనసు కల్లోల సముద్రంలా ఉంది. భయంగా ఉంది. ఆ ఉద్రిక్త సమయంలో కోచ్‌ మాటలను గుర్తు తెచ్చుకుంది. ‘ పోటీలో నువ్వు కొత్తగా ఏమీ చేయబోవడం లేదు. ట్రైనింగ్‌లో చేసినదాన్ని అక్కడ రిపీట్‌ చేస్తున్నావు. అంతే’... అప్పుడు ప్రీతికి ఎంతో ధైర్యం వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హషిమ్‌పూర్‌కు చెందిన ప్రీతి  పాల్‌ గత ఏడాది ΄్యారిస్‌లో జరిగిన  పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. మహిళల 100, 200–మీటర్ల రేస్‌ ఈవెంట్‌లో రెండు కాంస్య పతకాలు గెలుచుకుంది.  పారాలింపిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్‌ సృష్టించింది.

 చిన్న వయసులోనే సెరిబ్రల్‌  పాల్సీకి గురైంది ప్రీతి.  పారా అథ్లెట్‌ ఫాతిమా ఖూతూన్‌ను కలుసుకోవడంతో ప్రీతి జీవితం కొత్త మలుపు తీసుకుంది. ప్రీతి నోటి నుంచి వచ్చిన ‘రన్నింగ్‌ రేస్‌’ అనే మాట విని కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. సైన్యంలో పనిచేసే గజేంద్రసింగ్‌ ప్రీతికి కోచ్‌గా మారాడు. శిక్షణ ఇవ్వడానికి ముందు ఒక షరతు పెట్టాడు. ‘ఈ ఒక్కరోజు ట్రైనింగ్‌ వద్దు అని ఏ ఒక్కరోజు నీ నోటి నుంచి మాట వినబడినా ఇక ఎప్పుడూ శిక్షణ ఇవ్వను’ అయితే ప్రీతి  పాల్‌ నోటి నుంచి ‘సాధన’ అనే మాట తప్ప ‘విశ్రాంతి’ అనే మాట ఎప్పుడూ వినిపించలేదు. అదే ఆమె విజయరహస్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement