ఆవిరి పట్టడం మంచిదే కానీ..
రైట్ డైట్.. న్యూట్రిషనిస్టు సలహాలు
కరోనా నియంత్రణకు ఆవిరి పట్టడం మంచిదే. కానీ గంట గంటకూ లేదా అదే పనిగా తీసుకోవడం మంచిది కాదు. అలాగే సోషల్ మీడియాలో, యూట్యూబ్ చానళ్లలో పలు విపరీతమైన పద్ధతులు చూపిస్తున్నారు. అతి ఆవిరి వల్ల ముక్కు, గొంతు లోపల ఉండే సున్నితమైన భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. సాధారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ముక్కు దిబ్బడ వేయడం జరుగుతుంది కాబట్టి, ఆ సమయాల్లో ఆవిరి పడితే సరిపోతుంది.
ఆరోగ్య‘సి’రి
సి విటమిన్ కావాలని కరోనా రోగులు అతిగా నిమ్మకాయ తీసుకోవడం మంచిది కాదు. నిమ్మకాయతో పాటు జామ, బొప్పాయి తదితర తాజా పండ్లలో కూడా సి విటమిన్ ఉంటుంది. అలాగే క్యాప్సికమ్, ఉసిరికాయ వంటి వాటినుంచీ పుష్కలంగా
లభిస్తుంది.
రైట్ .. డైట్
మంచి ఆహారం కరోనా నియంత్రణలో కీలకాంశం. ఇష్టమొచ్చినట్లు తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆవిరి పట్టడం, కషాయాలూ మంచిదే కానీ... అతిగా ఏదీ చేయకూడదు, ఏదీ తినకూడదు. సప్లిమెంట్స్ కన్నా సహజమైన ఆహారం మంచిది. కరోనా కేసుల్ని మైల్డ్, మోడరేట్, సీరియస్.. ఇలా దశలుగా విభజిస్తున్నారు. సీరియస్ కండిషన్ అంటే ఆసుపత్రిలో ఉంటూ వైద్యుని పర్యవేక్షణలో ఐసీయూలో ఉంటారు.
వీళ్లను అలా ఉంచితే స్వల్ప లక్షణాలు ఉన్నవారు, కరోనా రాకూడదని ముందు జాగ్రత్తలు తీసుకునేవారు ఆహారానికి సంబంధించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తల పేరుతో ఎలా పడితే అలా ప్రొటీన్స్, విటమిన్స్, సప్లిమెంట్స్ వాడటం వలన లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జీర్ణకోశ వ్యవస్థలో కొన్ని మిలియన్ల కొద్దీ ఇమ్యూన్ సెల్స్ విడుదలవుతుంటాయి. కాబట్టి మంచిదనే పేరిట ఏది పడితే అది తింటూ జీర్ణకోశ వ్యవస్థను ఇబ్బంది పెట్టడం శరీరానికి హానికరం. సరైన వ్యాయామం, నిద్రతో పాటు ఆహారం కరోనా నియంత్రణలో కీలకాంశం.
– డాక్టర్ జానకి, న్యూట్రిషనిస్ట్
చదవండి: ఉదయం పెసరట్టు.. లంచ్లో బ్రౌన్ రైస్.. రాత్రికి రాగిముద్ద!