
పారిజాతగిరి హుండీ లెక్కింపు
జంగారెడ్డిగూడెం : పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవదాయశాఖ ఏలూరు జిల్లా ఇన్స్పెక్టర్ వి.సురేష్కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 105 రోజులకు గాను రూ.11,35,112 ఆదాయం వచ్చినట్లు ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. హుండీ లెక్కింపులో విజయవాడ, ఏలూరు, రిటైర్డ్ ఉద్యోగులు, కామయ్యపాలెం, పుట్లగట్లగూడెం సేవాసంఘం, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి తోమాల సేవ, తీర్థప్రసాద గోష్టి, తదితర పూజలు నిర్వహించారు. స్వామి వారిని నరసాపురం, పాలకొల్లు, తణుకు భక్తులు దర్శించుకున్నారు.
20న చెస్ టోర్నమెంట్
భీమవరం: ఇంటర్నేషనల్ చెస్ డేను పురస్కరించుకుని అనసూయ చెస్ అకాడమీ, వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన గ్రంధి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు మాదాసు కిషోర్ చెప్పారు. గురువారం టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని తాలూకా ఆఫీసు సెంటర్లోని జీవీఆర్ కళ్యాణ మండపంలో టోర్నమెంట్ జరుగుతుందన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచితంగా మాస్టర్ చెస్ బోర్డులు, విజేతలకు రూ.20 వేల నగదు బహుమతులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు తోట భోగయ్య విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షుడు అల్లు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
కొయ్యలగూడెం: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన కొయ్యలగూడెం సుందరయ్యనగర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేదే రాజేశ్వరి (24) బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి వద్ద ఉరి వేసుకుని మృతి చెందినట్లు రాజేశ్వరి బంధువులు పేర్కొన్నారు. ఆమెకు భర్త ధనుష్, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ కింద పడి వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం రూరల్: లారీ వెనుక చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చినతాడేపల్లిలో గురువారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టెంపాలెం గ్రామానికి చెందిన నీలం రవితేజ (35) తాడేపల్లిగూడెంలోని ఒక ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. గురువారం మోటారు సైకిల్పై తాడేపల్లిగూడెం వస్తుండగా చినతాడేపల్లి వచ్చేసరికి ముందు వెళ్తున్న ఎరువుల లోడు లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు వెనుక చక్రాల కింద పడి రవితేజ దుర్మరణం చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.