
వరుస పురస్కారాలపై హర్షం
కాకినాడ సిటీ: రెడ్క్రాస్ జిల్లా శాఖ మరొకసారి పురస్కారాలు పొందడం మనకు గర్వకారణమని రెడ్క్రాస్ జిల్లా శాఖ అధ్యక్షుడు, కలెక్టర్ షణ్మోహన్ సగిలి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రెడ్క్రాస్ శాఖ అధ్యక్షుడు, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో 2021–22 నుంచి 2023–24 సంవత్సరం వరకు వరుసగా మూడు సంవత్సరాలు అత్యుత్తమ జిల్లా శాఖగా కాకినాడ జిల్లా మొదటి స్థానాన్ని గెలుచుకోగా పురస్కారాలను సంస్థ చైర్మన్ వైడీ రామారావు, కోశాధికారి ఎన్వీవీఆర్కె ప్రసాద్బాబు, కార్యదర్శి కె శివకుమార్ మంగళవారం కలెక్టర్కు అందజేసిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉత్తమ జిల్లా శాఖ అవార్డులు ఏర్పాటు చేసినప్పటి నుంచి వరుసగా ఏడుసార్లు మన జిల్లా శాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. చైర్మన్ వైడీ రామారావు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని నూతన సేవా కార్యక్రమాల ద్వారా రెడ్క్రాస్ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి కృషి చేస్తామన్నారు. ఇటీవల రెడ్క్రాస్కు సేవలు అందించి గవర్నర్ ద్వారా పురస్కారాలు అందుకున్న ఓఎన్జీసీ, కేఎస్పీఎల్ ప్రతినిధులకు, సాయిరామ ప్రోజెన్ ఫుడ్స్ అధినేత ఎల్ సత్యనారాయణ, ఫిలిం డైరెక్టర్ బి సుకుమార్లకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
మెట్ట జలగలతో జాగ్రత్త
పిఠాపురం: మెట్ట జలగల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రారంభ దశలోనే నివారణకు చర్యలు తీసుకోవాలని పిఠాపురం ఉద్యాన శాఖాధికారి వై.సోమరాజశేఖర్ రైతులకు సూచించారు. ఆయన మంగళవారం గొల్లప్రోలు మండలం చెందుర్తిలో పర్యటించి మెట్ట జలగలు సోకిన పంటలను పరిశీలించారు. ఇటీవల గొల్లప్రోలు మండలంలో వివిధ పంటలకు మెట్ట జలగలు సోకి తీవ్ర నష్టాలను కలిగించిన వైనంపై ‘సాక్షి’ దినపత్రికలో ‘జల గండం’ శీర్షికన వెలువడిన కథనానికి ఉద్యాన శాఖాధికారులు స్పందించారు. ఆయన మాట్లాడుతూ వాణిజ్య పంటల్లో మెట్ట జలగలను గమనించామన్నారు. ఎక్కువగా మిరప, బొప్పాయి వంటి తోటల్లో కనిపించాయని, వీటిని తొలి దశలోనే నివారించక పోతే ఎక్కువ మొత్తంలో పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. పొలంలో తడి తగ్గించడమే కాక సాయంత్రం నీరు పెట్ట కూడదన్నారు. మిరప తోటలో కలుపు, వాడిన ఆకులు పూర్తిగా తొలగించుకోవాలన్నారు. మెట్ట జలగలకు ఆశ్రయం కలిగించే చెట్లను తొలగించాలని, రాళ్లు, చెత్త లేకుండా చూసుకుంటూ పొదల కింద వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. మెటాల్డిహైడ్ బైట్ 2.5 శాతం,1 నుంచి 2 కిలోలు ఎకరాకు ఇసుకలో కలిపి వేసుకోవాలన్నారు. ఐరన్ ఫాస్ఫేట్ బైట్ 2 నుంచి 4 కిలోలు ఎకరాకు సాయంత్రం వేళ పొలం చుట్టూ లేదా మిరప రద్దెల మధ్య చల్లుకోవాలన్నారు. దీనిని వర్షం వచ్చి పోయిన తర్వాత మళ్లీ వేయడం అవసరమన్నారు. పొగాకు పొడిని చేను అంతటా తడిగా ఉన్నప్పుడు చుట్టూ చల్లు కోవడం ద్వారా వీటిని నియంత్రివచ్చని తెలిపారు. వర్షం వచ్చి పోయిన తరువాత పొలం పరిశీలించడం ద్వారా వీటి ఉనికిని గమనించవచ్చన్నారు. పొలాల్లో మెట్ట జలగలు, నత్తలు కనిపిస్తే వెంటనే రైతు సేవా కేంద్రం ద్వారా ఉద్యాన శాఖ సిబ్బందికి తెలియజేస్తే వారు నివారణ చర్యలు సూచిస్తారన్నారు.
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులుగా
రాంప్రసాద్, ఆనంద్
గోకవరం/పెదపూడి: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులుగా గోకవరానికి చెందిన సీనియర్ నాయకుడు తోలేటి రాంప్రసాద్, అనపర్తి నియోజకవర్గానికి చెందిన పందిరి ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా రాంప్రసాద్ భార్య తోలేటి రమ్యశ్రీ గోకవరం ఎంపీటీసీ 1గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరికి పార్టీ నేతలు అభినందనలు తెలిపారు.

వరుస పురస్కారాలపై హర్షం

వరుస పురస్కారాలపై హర్షం