
పరిమితికి లోబడి పొగాకు సాగు
ఫ రైతులకు టొబాకో బోర్డు ఆర్ఎం ప్రసాద్ సూచన
ఫ 2025–26 పంట కాలానికి ఉత్పత్తి ఖరారు
ఫ రాష్ట్రంలో 142 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి
దేవరపల్లి: పొగాకు బోర్డు 2025–26 పంట కాలానికి ఉత్పత్తిని ఖరారు చేసినందున రైతులు పరిమితికి లోబడే పొగాకు సాగు చేయాలని బోర్డు రాజమహేంద్రవరం రీజినల్ మేనేజర్ జీఎల్కే ప్రసాద్ సూచించారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రీజియన్ పరిధిలోని ఉత్తర తేలిక నేలలు (ఎన్ఎల్ఎస్) ప్రాంతంలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల పరిధిలో బ్యారన్కు 35.15 క్వింటాళ్ల చొప్పున 49.70 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతించిందని వివరించారు. 2024–25 పంట కాలంలో బ్యారన్కు 41.25 క్వింటాళ్ల చొప్పున 58.25 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, సుమారు 80 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 2023–24 పంట కాలంలో బ్యారన్కు 25 క్వింటాళ్ల చొప్పున ఉత్పత్తికి అనుమతి ఇచ్చారని చెప్పారు.
2025–26 పంట కాలానికి రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాల పరిధిలో 148 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చినట్టు ప్రసాద్ తెలిపారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో బ్యారన్కు 3,512 కిలోల చొప్పున 49.70 క్వింటాళ్లు, దక్షిణ ప్రాంత తేలిక నేలల (ఎస్ఎల్ఎస్) ప్రాంతంలో బ్యారన్కు 3,656 కిలోల చొప్పున 48.10 మిలియన్ల కిలోలు, దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలలు (ఎస్బీఎస్) బ్యారన్కు 3,565 కిలోల చొప్పున 42.10 మిలియన్ల కిలోలు, ఉత్తర ప్రాంత నల్లరేగడి నేలలోల్ల (ఎన్బీఎస్) బ్యారన్కు 2,102 కిలోల చొప్పున 2.10 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతించిందని వివరించారు. అయితే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న నిల్వలను దృష్టిలో పెట్టుకుని 142 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తికి అనుమతించారని చెప్పారు. 2025–26 పంట కాలంలో రైతులు విధిగా పంట నియంత్రణ పాటించి, నాణ్యత పెంపుపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
మూడేళ్లకోసారి బ్యారన్ల రిజిస్ట్రేషన్లు
ఈ ఏడాది నుంచి మూడేళ్లకోసారి బ్యారన్ల రిజిస్ట్రేషన్లు చేయనున్నట్టు ప్రసాద్ తెలిపారు. బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు మాత్రమే పొగాకు సాగు చేయాలని స్పష్టం చేశారు. కేటాయించిన కోటా మేరకు మాత్రమే పండించాలని, అధిక విస్తీర్ణంలో పండించరాదని చెప్పారు. అనధికారికంగా బ్యారన్లు నిర్మించరాదని, రిజిస్టర్ అయిన రైతులు అనధికారికంగా బ్యారన్లు నిర్మిస్తే రిజిస్ట్రేషన్లు నిలుపు చేస్తామని హెచ్చరించారు. పొగాకుతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకుని లాభాలు పొందాలని ఆయన సూచించారు. అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తిలో మన దేశం 3, ఎగుమతుల్లో 2 స్థానాల్లో ఉందని తెలిపారు. ప్రపంచ దేశాల్లో పొగాకు ఉత్పత్తి 3,762 మిలియన్ల కిలోల నుంచి 4,197 మిలియన్ల కిలోలకు పెరిగిందని చెప్పారు. బ్రెజిల్, జింబాబ్వే, చైనా దేశాల్లో పొగాకు ఉత్పత్తి అధికంగా జరిగినందున ప్రస్తుతం మన రైతులు పండించిన పొగాకును మంచి ధరకు అమ్ముకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ముఖ్యంగా లో గ్రేడ్ పొగాకు అమ్మకాలు మందకొడిగా జరుగుతున్నాయని ప్రసాద్ చెప్పారు.

పరిమితికి లోబడి పొగాకు సాగు