
యాత్రికుల సేవలో రైల్వే వన్
● అందుబాటులోకి కొత్త యాప్
● అనేక సౌకర్యాలతో రూపకల్పన
● కొత్త ఫీచర్ల చేరికతో మరిన్ని సేవలు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల కోసం రైల్వే శాఖ అనేక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. రైలు బోగీలోనే ప్రయాణికులకు వసతులన్నీ వచ్చి చేరేలా రైల్వే వన్ యాప్ను రూపొందించింది. ఇప్పటి వరకూ అనేక యాప్లు ఉన్నప్పటికీ, అన్నింటినీ ఏకం చేసి ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఈ రైల్వే వన్ యాప్లో ఐఆర్సీటీసీ సహా, భారతీయ రైల్వే అందించే దాదాపు అన్ని ప్రధాన సేవలు ఒకేచోట లభిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫారంల్లో లభ్యమయ్యే ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ సమాచారం, సీటు లభ్యత, ఫుడ్ ఆర్డర్ వంటి అనేక సేవలను పొందే అవకాశం ఉంది.
మరిన్ని సేవలు
మోర్ ఆఫరింగ్స్ విభాగంలో ప్రయాణికులు జర్నీ కోసం ముందుగానే భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. పీఎన్ఆర్ స్థితినీ చెక్ చేసుకోవచ్చు. కోచ్ స్థానాలను తెలుసుకోవచ్చు. రైల్వే సేవలపై ఫిర్యాదు చేయాలనుకునే వారు రైల్ మదద్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా పలు సమస్యలను నివేదించవచ్చు. ప్రధాన స్టేషన్లలోని అనేక రెస్టారెంట్లలో ఫుడ్ డెలివరీ బుక్ చేసుకునేందుకు పీఎన్ఆర్ నంబరును నమోదు చేసి, ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు.
టికెట్ బుక్ చేసుకోండిలా..
● ముందుగా రైల్వే వన్ యాప్ను ఓపెన్ చేయాలి.
● హోమ్ పేజీలో రిజర్వ్ టికెట్ విభాగంపై క్లిక్ చేయాలి.
● ప్రయాణ వివరాలు, గమ్యస్థానం, తేదీని నమోదు చేయాలి.
● అమౌంట్ పే చేసి, బుకింగ్ను ధ్రువీకరించుకోవాలి.
పీఎన్ఆర్ తెలుసుకునేదిలా..
● హోమ్ పేజీలో మోర్ ఆఫరింగ్స్ కింద ఉన్న పీఎన్ఆర్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
● పీఎన్ఆర్ నంబర్ నమోదు చేసి, బుకింగ్ వివరాలు తెలుసుకోవచ్చు.
● రైలు సమాచారం, ప్రయాణ తేదీ, సీటు స్థితి, రాబోయే స్టేషన్లు, తదుపరి స్టాప్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
రైల్ మదద్లో ఫిర్యాదు
వీడియో, చిత్రం, ఆడియో ఉపయోగించి సమస్యపై ఫిర్యాదు చేయవచ్చు. ఏ రైలులో, ఏ రైల్వే స్టేషన్లో సహాయం కావాలనే విషయాన్ని స్పష్టంగా ధ్రువీకరించాలి. సమస్యను స్పష్టంగా వివరించి, ఫిర్యాదును సమర్పించాలి.
అద్భుతమైన విధానం
ఇప్పటివరకు రైలు ప్రయాణం కోసం టికెట్ల రిజర్వేషన్ కోసం రైలు ఎక్కడుందో తెలుసు కోవ డం కోసం పలు యాప్లలో వెతకాల్సి ఉండేది. నూతనంగా భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన రైల్వే వన్ యాప్ ద్వారా ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. ఈ విధమైన యాప్ రావడం ప్రయాణానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణీకులకు సౌకర్యమంతమైన, సులభతరమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.
– జతిన్కుమార్ షెలత్, రాజమహేంద్రవరం
యూజర్ల సౌలభ్యం కోసం..
ఈ యాప్లో యూజర్ ఇంటర్ఫేస్ సులభంగా ఉంటుంది. హోమ్ పేజీలో వినియోగదారులు రిజిస్టర్ చేసుకున్న తర్వాత, వారి పేరు కనిపిస్తుంది. దాని కింద అన్ని సేవలను సూచించే చిహ్నాలుంటాయి. ఈ విభాగంలో ప్రయాణికులు రిజర్వుడ్, అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్నూ బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు తాము కోరుకునే టికెట్ను ఎంచుకుని, వివరాలను నమోదు చేసి, టికెట్లను పొందవచ్చు.

యాత్రికుల సేవలో రైల్వే వన్

యాత్రికుల సేవలో రైల్వే వన్