‘ఫోర్జరీ పోలీస్‌’ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

‘ఫోర్జరీ పోలీస్‌’ సస్పెన్షన్‌

Jul 4 2025 3:48 AM | Updated on Jul 4 2025 3:48 AM

‘ఫోర్జరీ పోలీస్‌’ సస్పెన్షన్‌

‘ఫోర్జరీ పోలీస్‌’ సస్పెన్షన్‌

కాకినాడ క్రైం: రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీఐజీ సంతకాన్నే ఫోర్జరీ చేసిన హెడ్‌ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం రాజమహేంద్రవరం జీఆర్‌పీ స్పెషల్‌ బ్రాంచ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసిన కొప్పిశెట్టి యోగి కామేశ్వరరావు ఏకంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీఐజీ సంతకాన్నే ఫోర్జరీ చేసి ఎస్‌ఐని అని ఓ నకిలీ ఐడీ కార్డును తన పేరుతో తయారు చేసుకున్నాడు. ఈ కార్డుని వాడుతూ, పలుచోట్ల బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ తరహాలోనే కాకినాడలోని రైల్వే గెస్ట్‌ హౌస్‌లో ఓ కుటుంబ వివాదంలో విచారణ పేరుతో కామేశ్వరరావు జోక్యం చేసుకున్నాడు. విచారణ సమయంలో ఓ మహిళను తాను ఎస్‌ఐని అని చెబుతూ నకిలీ ఐడీ కార్డు చూపించి మరీ బెదిరించారు. అయితే, అప్పటికే కామేశ్వరరావుది హెడ్‌ కానిస్టేబుల్‌ హోదా అని తెలుసుకున్న మహిళ నకిలీ ఐడీ కార్డు వ్యవహారాన్ని కాకినాడ జిల్లా ఎస్పీబిందుమాధవ్‌, ఇంటెలిజెన్స్‌ అధికారులకు వెల్లడించి, కాకినాడ టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ మొదలు కాగా, ప్రాథమిక ఆధారాల ప్రాతిపదికగా రాజమహేంద్రవరం జీఆర్‌పీ నుంచి అనకాపల్లి జిల్లా పోలీస్‌ శాఖకు కామేశ్వరరావును పంపారు. లోతైన విచారణ అనంతరం ఆరోపణలన్నీ వాస్తవాలని తేలడంతో అనకాపల్లి ఎస్పీ తుహిన్‌ సిన్హా కామేశ్వరరావును సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలిచ్చారు. అనంతరం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కాకినాడ జిల్లా పోలీస్‌ శాఖకు సిఫారసు చేశారు. కాకినాడలోని రైల్వే గెస్ట్‌ హౌస్‌ వద్ద మహిళను నకిలీ ఎస్‌ఐ ఐడీ కార్డుతో బెదిరించిన నేరంలో కామేశ్వరరావుకి సహకరించిన ఓ మహిళా కానిస్టేబుల్‌ పైనా చర్యలు తీసుకోవాలని, బదిలీపై తూర్పుగోదావరి జిల్లా పోలీస్‌ శాఖకు వెళుతున్న నేపథ్యంలో అక్కడి పోలీసులకు అనకాపల్లి ఎస్పీ సిఫారసు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement