క్షయ రహిత జిల్లా దిశగా అడుగులు
● కలెక్టర్ మాధవీలత
● రాజమహేంద్రవరంలో ర్యాలీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): క్షయ వ్యాధి రహిత జిల్లా దిశగా అడుగులు వేయడంలో ప్రజల మద్దతు, భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత అన్నారు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా స్థానిక వై.జంక్షన్ నుంచి ఆనం కళాకేంద్రం వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అధికారులు, విద్యార్థినులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ టీబీ లక్షణాలు ఉన్నవాళ్లు డాక్టర్ వద్దకు వెళ్లి తగిన చికిత్స, ఆహారం తీసుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యవంతులు కావచ్చన్నారు. నిక్షయ మిత్రతో టీబీ బాధితులకు పోష్టికాహారం అందించే అవకాశం ఉందన్నారు. దీనిద్వారా ఒక రోగిని దత్తత తీసుకోవచ్చని, ఇందుకోసం రూ.4,200 అందజేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే ఆ రోగికి ఆరునెలలు పౌష్టికాహారం అందిస్తుందన్నారు. 94 మంది నిక్షయమిత్రల ద్వారా 524 మందిని దత్తత తీసుకుని బలవర్థక ఆహారం అందిస్తున్నామన్నారు. అనంతరం జీఎస్ఎల్ నర్సింగ్ విద్యార్థినులు టీబీపై రూపొందించిన వీధి నాటిక అలరించింది. ర్యాలీలో డీఎంహెచ్వో డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎన్.వసుంధర, డీపీవో జగదాంబ, ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.