‘శ్రీ శోభకృత్’లో సత్యదేవునికి సిరి వృద్ధి
అన్నవరం: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో సత్యదేవునికి ఆదాయం వృద్ధి చెంది స్వామివారి ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందుతుందని ఆలయ ఆస్థాన ప్రధాన వేద పండితుడు బ్రహ్మశ్రీ గొల్లపల్లి వేంకట్రామ సుబ్రహ్మణ్య ఘనపాఠి తెలిపారు. ఉగాది వేడుకలు రత్నగిరిపై అనివేటి మంటపంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఉదయం 9–30 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి ఉత్సవమూర్తులను సత్యదేవుని ఆలయం నుంచి ఊరేగింపుగా అనివేటి మంటపం వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం నూతన సంవత్సర పంచాంగాలను స్వామి, అమ్మవార్ల చెంత ఉంచి పండితులు పూజలు చేశారు. వేద పండితులు శ్రీ గొల్లపల్లి వేంకట్రామ సుబ్రహ్మణ్య ఘనపాఠి ‘శోభకృత్’ నామ నూతన సంవత్సర పంచాంగ ఫలితాలను చదివి వివరించారు. శ్రీ సత్యదేవునికి ఈ ఏడాది ఆదాయం 14, వ్యయం రెండుగా ఉందన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి, స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు.