చిన్నారి హృదయం.. ఇక భద్రం
సాక్షి, అమలాపురం: అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామానికి చెందిన నేదునూరి దివ్య హర్షితకు గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది. గ్రామానికి చెందిన నేదునూరి ధనరాజు, దుర్గావాణి దంపతుల కుమార్తె హర్షిత గుండెలో రంధ్రం ఏర్పడటంతో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంది. శస్త్రచికిత్స చేయించుకునే స్తోమత లేకపోవడంతో వారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మంత్రి.. ఆ చిన్నారికి సాయం చేయాల్సిందిగా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారికి రూ.3 లక్షల ఖరీదైన శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేయించేందుకు ప్రభుత్వం నుంచి కలెక్టర్ అనుమతి తీసుకున్నారు. హర్షితకు తిరుపతి పద్మావతి హృదయాలయ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి గుండె రంధ్రాన్ని విజయవంతంగా పూడ్చారు. ఈ నేపథ్యంలో హర్షిత తమ తల్లిదండ్రులతో కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్ శుక్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ టి.రాధాకృష్ణ, మేనేజర్ నవీన్, టీమ్ లీడర్ సత్యనారాయణ, డీసీహెచ్ఎస్ పద్మశ్రీ రాణి పాల్గొన్నారు.
ఫ విజయవంతంగా శస్త్రచికిత్స
ఫ ఆరోగ్యశ్రీలో రూ.3 లక్షల కేటాయింపు