ఏటీఎంలో చోరీకి యత్నించిన నిందితుల అరెస్టు

సామర్లకోట: జి.మేడపాడులోని ఎస్‌బీఐ ఏటీఎంలో ఈ నెల 15న చోరీకి యత్నించిన నిందితులను అరెస్టు చేశామని సీఐ కె.దుర్గాప్రసాద్‌ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ ఘటనపై ఎస్‌బీఐ మేనేజర్‌ కనిగిరి కృష్ణమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఏటీఎంలోని సీసీ కెమెరాల ఆధారంగా మండలంలోని జి.కొత్తూరుకు చెందిన రాయి నాగేంద్రబాబు, బెంతుకూర సురేంద్ర ఈ నేరానికి పాల్పడినట్టు గుర్తించామని తెలిపారు. వారిని మంగళవారం అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం అంగీకరించారని చెప్పారు. ఈ నెల 15న ఏటీఎంలో రూ.40 లక్షలు పెట్టినట్టు మేనేజరు తెలిపారన్నారు. నిందితులను రిమాండుకు తరలించామని సీఐ చెప్పారు.




 

Read also in:
Back to Top