‘అముడా’ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

- - Sakshi

అమలాపురం పట్టణాభివృద్ధి సంస్థకు గెజిట్‌

అమలాపురం టౌన్‌: గత ఏడాది ఉగాది పర్వదినం సందర్భంగా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసి, పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఉగాది పండగ వేళ మరో కానుక ఇచ్చింది. జిల్లాలో పట్టణాభివృద్ధి వేగం పెంచేందుకు, అది ప్రణాళికాబద్ధంగా జరిగేందుకు వీలు కల్పిస్తూ.. అమలాపురం పట్టణాభివృద్ధి సంస్థ (అముడా) ఏర్పాటు చేసింది. ఇప్పటికే దీని ఏర్పాటుకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా అముడా ఏర్పాటుపై మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి మార్గదర్శకాలతో కూడిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అమలాపురం మున్సిపాలిటీ, ముమ్మిడివరం నగర పంచాయతీతో పాటు 11 మండలాల్లోని 120 గ్రామాలను అముడా పరిధిలోకి తీసుకు వచ్చింది. అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, కాట్రేనికోన మండలాలు పూర్తిగా అముడా పరిధిలోకి వచ్చాయి. ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలను కూడా అముడా పరిధిలో చేర్చారు. అముడాకు త్వరలో పాలకవర్గాన్ని నియమించనున్నారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, మెంబర్‌ కన్వీనర్‌, పలు ప్రభుత్వ శాఖల నుంచి ఐదుగురు సభ్యులను ఇందులో నియమించనున్నారు. ముఖ్య కార్యనిర్వహణాధికారిని (సీఈఓ) కూడా నియమిస్తారు.

అముడా స్వరూపమిదీ..

మున్సిపాలిటీ : అమలాపురం

నగర పంచాయతీ : ముమ్మిడివరం

గ్రామాలు : 120

విస్తీర్ణం : 896.16 చ.కి.మీ.

జనాభా : 7,09,149




 

Read also in:
Back to Top