ఇద్దరి అనుమానాస్పద మృతి 

Two Suspicious Deceased In West Godavari - Sakshi

వివాహేతర సంబంధమే కారణమా!

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఓ యువతి, యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. యువతి మృతితో ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమైపోగా.. యువకుడిని కోల్పోయి మరో కుటుంబం తల్లడిల్లుతోంది.

నిడదవోలు రూరల్‌: నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామంలో వివాహిత, యువకుడు పురుగు మందు తాగి ఆదివారం అనుమానాస్పదంగా మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం... తాళ్లపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ యామన శ్రీనివాసరావుకు ఏలూరుకు చెందిన కుసుమ నాగసాయి (30)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. నాగసాయికి ఏలూరుకు చెందిన షేక్‌ నాగూర్‌ (28) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

తాళ్లపాలెం వచ్చిన నాగూర్‌తో కలిసి సమీపంలోని ఒక ఇంట్లో నాగసాయి మాట్లాడుతుండగా భర్త శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు చూసి వారిని నిలదీశారు. వీరిద్దరిని ఒక కారులో శెట్టిపేట శ్రీకృష్ణ మొబైల్‌ ఫాస్ట్‌ఫుడ్‌ షాపు గదిలోకి తీసుకువెళ్లి నిర్బంధించగా అక్కడ నాగసాయి, నాగూర్‌లు పురుగు మందు తాగి అనుమానాస్పదంగా మృతిచెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి భర్త శ్రీనివాసరావుతో పాటు అతని కుటుంబ సభ్యులను నిడదవోలు సీఐ కేఏ స్వామి, ఎస్సై జగదీశ్వరరావు విచారిస్తున్నారు.

బలవంతంగా తాగారా..? తాగించారా..? 
వివాహిత నాగసాయి, యువకుడు నాగూర్‌ల వివాహేతర సంబంధం బయటపడటంతో అవమాన భారంతో పురుగుమందు తాగారా..?  లేదా ఆమె భర్త శ్రీనివాసరావు బంధువులు వారిద్దరితో బలవంతంగా తాగించరా..? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏలూరు నుంచి నాగూర్‌ వచ్చి తాళ్లపాలెంలో ఉన్న నాగసాయిని పలుమార్లు స్థానికంగా ఉండే మహిళ సహకారంతో ఒక ఇంట్లో కలుసుకునేవారని, ఆదివారం కూడా ఇలాగే జరగడంతో భర్త, అతని కుటుంబ సభ్యులు వీరిని గదిలోనే పట్టుకుని ఇద్దరినీ కొట్టి బలవంతంగా పురుగు మందు తాగించి చంపేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: 
విషాదం మిగిల్చిన ‘దీపం’: బతికుండగానే..
ప్రాంక్‌ అంటూ 300 అశ్లీల వీడియోలు..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top