ఇళ్లు కట్టుకోవటానికి డబ్బులు ఇవ్వలేదని..

Man Assassinated Parents In Tamil Nadu - Sakshi

తల్లిదండ్రుల్ని కడతేర్చాడు 

సాక్షి, చెన్నై: ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఓ తనయుడు ఉన్మాదిగా మారాడు. కని పెంచిన తల్లిదండ్రుల్ని రాడ్డుతో కొట్టి చంపేశాడు. శనివారం ధర్మపురిలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు...ధర్మపురి జిల్లా పూచ్చెట్టి గ్రామానికి చెందిన రామచంద్రన్‌(65), చిన్నరాజి(60) దంపతులకు రామస్వామి (40), సుమతి(35) కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరికి పెళ్లిల్లు అయ్యాయి. రామస్వామి అదే గ్రామంలో మెకానిక్‌ షెడ్‌ నడుపుతున్నాడు. సుమతి పెన్నగరంలోని అత్తారింట్లో ఉంది. ఈ పరిస్థితుల్లో గత నెల తన పేరిట ఉన్న స్థలంలో సగం భాగాన్ని రాజి తన ఇద్దరు పిల్లల పేరిట రాసింది. తనకు భాగంగా వచ్చిన స్థలంలో సుమతి ఇంటి నిర్మాణంపై దృష్టి పెట్టింది. తన సోదరి ఇళ్లు కట్టుకుంటుండడంతో రామస్వామి కూడా దృష్టి పెట్టారు. తనకు భాగంగా వచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు నిర్ణయించాడు.

అయితే ఇందుకు కావాల్సిన నగదును తల్లిదండ్రుల వద్దే డిమాండ్‌ చేస్తూ, తరచూ గొడవ పడడం మొదలెట్టాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న రామస్వామి తల్లి చిన్నరాజితో గొడవపడ్డాడు. కోపోద్రిక్తుడైన రామస్వామి ఇనుపరాడ్డుతో ఆమె తల పగులకొట్టి చంపేశాడు. అడ్డొచ్చిన తండ్రి రామచంద్రన్‌ తల కూడా పగులగొట్టి ఉడాయించారు. రామచంద్రన్‌ కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రామచంద్రన్‌ మృతిచెందాడు. విషయం తెలిసి ధర్మపురి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమారా్టనికి తరలించారు. మత్తుదిగినానంతరం తాను చేసిన కిరాతకం గుర్తుకు వచ్చిన రామస్వామి నేరుగా వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top