అనుమానం.. పెనుభూతమై!

Boyfriend Killed Lover And Commits Suicide Attempt in West Godavari - Sakshi

ప్రియురాలి గొంతు నులిమి హత్య.. 

ఆపై తానూ ఆత్మహత్యాయత్నం 

స్థానికుల సమాచారంతో ఆస్పత్రికి తరలింపు.. హత్య కేసుగా నమోదు 

ఉంగుటూరు(గణపవరం): అనుమానం పెనుభూతమై.. ప్రియురాలిని నమ్మించి దారుణంగా చంపడమే కాక తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంకు చెందిన మడకం రామలక్ష్మి (45) అనే మహిళ భర్తతో విడిపోయి కొంతకాలంగా తన ముగ్గురు పిల్లలతో వేరుగా ఉంటోంది. కొంతకాలం తర్వాత అదే గ్రామానికి చెందిన ఎర్ర సూర్యారావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అనంతరం వివాహేతర సంబంధంగా మారింది. వీరు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. సూర్యారావుకు  ఇటీవల రామలక్ష్మి ప్రవర్తనపై అనుమానం ఏర్పడింది.

ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం నుంచి రామలక్ష్మి ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యులు ఆమె కోసం గాలిస్తున్నారు. బుధవారం ఉదయం బహిర్భూమికి అడవిలోకి వెళ్లిన కొందరు మహిళలు అక్కడ రామలక్ష్మి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. రామలక్ష్మి ఇంటి నుంచి అడవిలో సుమారు 500 మీటర్ల దూరంలో ఆమె మృతదేహం పడి ఉంది. బుధవారం ఉదయం గణపవరం సీఐ డేగల భగవాన్‌ప్రసాద్‌ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనా స్థలానికి కొంతదూరంలో సూర్యారావు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి అతనిని చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. రామలక్ష్మి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉందనే అనుమానంతోనే సూర్యారావు ఆమెను నమ్మించి అడవిలోకి తీసుకెళ్లి గొంతు నులిమి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం సూర్యారావు సమీపంలోని పొలాల వద్దకు వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెబుతున్నారు. గణపవరం సీఐ డేగల భగవాన్‌ప్రసాద్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top