వైఎస్సార్సీపీ నేతపై బీజేపీ కార్యకర్తల దాడి
నారాయణవనం(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం ఎరికంబట్టు మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు సెల్వంపై బీజేపీ కార్యకర్తలు శనివారం దాడి చేసి గాయపరిచారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల పోలింగ్ను పురస్కరించుకుని ఎరికంబట్టు గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు శనివారం ఓటర్లకు కమలం గుర్తున్న స్లిప్పులను పంపిణీ చేశారు. దీనిపై మాజీ సర్పంచ్ సెల్వం ప్రశ్నించడంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు ధనంజయులురెడ్డి, పాండియన్, మహేష్, అజిత్ తదితరులు ఆయనపై దాడి చేశారు. ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. పుత్తూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం ఆయన స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ హనుమంతప్ప తెలిపారు.