బీజేపీ నేత హత్య కేసులో నిందితుడి ఎన్కౌంటర్
లక్నో: ఉత్తర ప్రదేశ్లో మరో వాంటెడ్ క్రిమినల్ హతమయ్యాడు. లక్నోలోని సరోజిని నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో కరడు గట్టిన నేరస్థుడు రాకేశ్ పాండేను యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం ఎన్కౌంటర్ చేశారు. ఈ విషయాన్ని ఐజీ అమితాబ్ యష్ మీడియాకు వెల్లడించారు. అతని తలపై లక్ష రూపాయల రివార్డు ఉంది. కాగా యూపీలోని మావో జిల్లాకు చెందిన రాకేశ్ పాండే అలియాస్ హనుమాన్ పాండే ఎన్నో నేరాలకు పాల్పడ్డాడు. 2005లో నవంబర్ 29న బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్తో పాటు మరో 6 మందిని హతమార్చిన కేసులో పాండే నిందితుడిగా ఉన్నాడు. (చైల్డ్ పోర్నోగ్రఫీ సెర్చ్.. ఇద్దరు అరెస్ట్)
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా అది తర్వాత సీబీఐ చేతికి చేరింది. 2013లో కృష్ణానంద రాయ్ భార్య అల్కా రాయ్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మేరకు ఉన్నత న్యాయస్థానం ఈ కేసును ఘజియాపూర్ నుంచి ఢిల్లీకి మార్చాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వాళ్లే వ్యతిరేకులుగా మారారని పేర్కొన్న సీబీఐ కోర్టు..వారిని నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో పాండే సన్నిహితుడు, గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ముక్తర్ అన్సారీ సహా పలువురిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అల్కా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఉండగానే రాకేశ్ పాండే పోలీస్ ఎన్కౌంటర్లో హతమవ్వడం చర్చనీయాంశంగా మారింది. (మళ్లీ జైలుకు జేసీ..)