మేం అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం గుడుపల్లిలో బాబు.. వి.కోటలో లోకేష్ హామీ గద్దెనెక్కి రెండేళ్లయినా తగ్గని పెట్రో ధరలు నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతోంది. అయినా ఎన్నికల ముందు చంద్రబాబు, నారా లోకేష్ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అందులో అతి ముఖ్యమైనది పెట్రోల్, డీజిల్ ధరలు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా పలమనేరు నియోజకవర్గం వి.కోట సమీపంలో ఏపీ సరిహద్దు లోని కర్ణాటక పెట్రోల్ బంక్ వద్ద నిల్చొని ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల గురించి మాట్లాడారు. ఏపీలో ధరలు అధికంగా ఉన్నాయని, అదే రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటకలో ధరలు తక్కువగా ఉన్నాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. అలాగే చంద్రబాబు ఎన్నికల ముందు బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో రాష్ట్రమంతా పర్యటించారు. అందులో భాగంగా సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజక వర్గంలో 2022 మే 11, 12వ తేదీల్లో గుడుపల్లి, శాంతిపురం, రామకుప్పం, కుప్పం మండలాల్లో పర్యటించి సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై విమర్శలు చేశారు. ఎన్నికలయ్యాయి, చంద్రబాబు సీఎం అయ్యారు. రెండేళ్లు పూర్తవుతున్నా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోగా.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కంటే అధికంగా పెంచి విక్రయిస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు మళ్లీ పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వ్యవసాయం పెట్టుబడి ఖర్చు కూడా పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్యాస్ కొరత తీవ్రమైంది. ఫలితంగా హోటళ్లలో భోజనాలు, తినుబండారాల ధరలు అమాంతం పెంచేశారు. పనిలో పనిగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్న యుద్ధం పేరుతో ధరలు పెంచితే.. నేడు ఇంధనం పొదుపు పేరుతో ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నేడు
ఇదీ
పరిస్థితి
చిత్తూరు జిల్లా
నగరి పెట్రోలు బంకులో ధరలిలా..
లీటర్ పెట్రోల్: రూ. 114
లీటర్ డీజిల్: రూ. 101.71
తమిళనాడు
పల్లిపట్టులోని పెట్రోల్ బంక్ ధరలివీ..
లీటర్ పెట్రోల్: రూ. 105.17
లీటర్ డీజిల్: రూ. 96.81
తాము అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నంత అమలు చేస్తామని పెద్ద బాబు, చిన్న బాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కూడా టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీనే. ఈ క్రమంలో రాష్ట్రంలో కూడా సమీప రాష్ట్రాల్లో ఉన్నంత మేరకే పెట్రోలు, డీజిల్ ధరలు ఎందుకు తగ్గించలేకపోయారని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.
కర్ణాటక
ఏపీ సరిహద్దులో ఉన్న
కర్ణాటక పెట్రోలు బంకులో ధరలివీ..
లీటర్ పెట్రోల్: 107.36
లీటర్ డీజిల్ : రూ. 95
చిత్తూరు జిల్లా
కర్ణాటక సరిహద్దులోని
వి.కోట పెట్రోల్ బంక్లో ధరలివీ..
లీటర్ పెట్రోల్ : రూ. 114.33
లీటర్ డీజిల్: రూ. 100.77


