
పెన్షనర్లపై చిన్నచూపు తగదు
చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల పట్ల చిన్నచూపు చూడడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగరాజ తెలిపారు. ఈ మేరకు ఆ అసోసియేషన్ నాయకులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట డిమాండ్ల పరిష్కారానికి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన వ్యాలిడేషన్ అమెండ్మెంట్ను వెంటనే రద్దు చేయాలన్నారు. పీఎఫ్ఆర్డీఏ చట్టం వల్ల పెన్షనర్లకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్పీఎస్, యూపీఎస్ విధానాలను నిలిపివేయాలన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే పే కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారులకు అందజేశారు. ఈ ధర్నాలో నాయకులు మురుగానందం, మురళి, ప్రభాకర్నాయుడు, శివకుమార్, దశరథనాయుడు, పలమనేరు, బంగారుపాళ్యం నుంచి పెన్షనర్లు పాల్గొన్నారు.