నేడు గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌!

SGX Nifty indicates Market may open with gap down today - Sakshi

ఫెడ్‌ హెచ్చరికలు- యూఎస్‌ మార్కెట్లు వీక్‌

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 161 పాయింట్లు మైనస్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో భారీ అమ్మకాలు

నిఫ్టీకి 11,355-11,290 వద్ద సపోర్ట్స్

నేడు (20న) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 161 పాయింట్లు కోల్పోయి 11,267 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్‌ నెల ఫ్యూచర్స్‌ 11,428 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 కారణంగా ఆర్థిక రికవరీ అత్యంత అనిశ్చితికి లోనవుతున్నట్లు ఫెడ్‌ పేర్కొనడంతో బుధవారం యూఎస్‌ మార్కెట్లు 0.3-0.6 శాతం మధ్య డీలాపడ్డాయి. ఈ ప్రభావంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాలు తలెత్తాయి. మార్కెట్లన్నీ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. ఈ నేపథ్యంలో నేడు ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వెరసి మార్కెట్లు అత్యధిక సమయం నష్టాలమధ్యే కదలవచ్చని అంచనా వేశారు.

లాభాలు స్వల్పమే
చివరి అర్ధగంటలో అమ్మకాలు తలెత్తడంతో బుధవారం దేశీ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్లు జమ చేసుకుని 38,615 వద్ద ముగిసింది. నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 11,408 వద్ద నిలిచింది. అయితే తొలుత సెన్సెక్స్‌ 38,788ను అధిగమించింది. తదుపరి 38,551కు వెనకడుగు వేసింది. ఇదేవిధంగా నిఫ్టీ ఇంట్రాడేలో 11,460 వద్ద గరిష్టాన్ని తాకగా 11,394 వద్ద కనిష్టాన్నీ చేరింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,355 పాయింట్ల వద్ద, తదుపరి 11,290 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,448 పాయింట్ల వద్ద, ఆపై 11,487 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,120 పాయింట్ల వద్ద, తదుపరి 21,928 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,392 పాయింట్ల వద్ద, తదుపరి 22,498 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 459 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 97 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,135 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు రూ. 379 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top