సెన్సెక్స్ ట్రిపుల్- నిఫ్టీ సెంచరీ
357 పాయింట్లు ప్లస్- 38,577కు సెన్సెక్స్
105 పాయింట్లు ఎగసిన నిఫ్టీ- 11,417 వద్ద ట్రేడింగ్
1 శాతం స్థాయిలో పుంజుకున్న ప్రధాన రంగాలు
ముందు రోజు నష్టాలను పూడ్చుకుంటూ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సాధించగా.. నిఫ్టీ సెంచరీ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 357 పాయింట్లు జంప్చేసి 38,577ను తాకింది. నిఫ్టీ 105 పాయింట్లు ఎగసి 11,417 వద్ద ట్రేడవుతోంది. టెక్ దిగ్గజాల అండతో గురువారం యూఎస్ ఇండెక్స్ నాస్డాక్ మరోసారి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఆసియాలోనూ సానుకూల ధోరణి నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
ప్రభుత్వ బ్యాంక్స్ జోరు
ఎన్ఎస్ఈలో అన్ని ప్రధాన రంగాలూ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో పవర్గ్రిడ్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, విప్రో, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, యాక్సిస్ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్లో కేవలం ఎయిర్టెల్ అదికూడా 0.3 శాతం నీరసించింది.
భెల్ అప్
డెరివేటివ్స్లో బీహెచ్ఈఎల్, సెయిల్, అదానీ ఎంటర్, దివీస్ ల్యాబ్, ఎస్బీఐ లైఫ్, జీఎంఆర్, ఎంజీఎల్, అపోలో హాస్పిటల్స్, సెంచురీ టెక్స్, మైండ్ట్రీ 7.4-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు అశోక్ లేలాండ్, సన్ టీవీ, టీవీఎస్ మోటార్ మాత్రమే 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1458 లాభపడగా.. 346 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.
మరిన్ని వార్తలు