వహ్వా సెన్సెక్స్.. 40,000కు
522 పాయింట్ల హైజంప్- 39,900 వద్ద ట్రేడింగ్
143 పాయింట్లు ఎగసిన నిఫ్టీ- 11,790 వద్దకు
ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ హవా -మీడియా బోర్లా
బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు కదం తొక్కుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 40,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం 522 పాయింట్లు జంప్చేసి 39,900 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో నిఫ్టీ 143 పాయింట్లు ఎగసి 11,790 వద్ద కదులుతోంది. వారాంతాన అమెరికా ఇండెక్సులు పలు రికార్డులు సాధించగా.. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లన్నీ హుషారుగా ట్రేడవుతున్నాయి. దీంతో సెంటిమెంటు మెరుగుపడినట్లు నిపుణులు తెలియజేశారు.
ఫార్మా వీక్
ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్, పీఎస్యూ బ్యాంక్ ఇండెక్సులు 2.5 శాతం చొప్పున ఎగశాయి. రియల్టీ 1 శాతం బలపడగా.. మీడియా 0.9 శాతం, ఫార్మా 0.3 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫ్రాటెల్, ఇండస్ఇండ్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ,. ఓఎన్జీసీ, ఐవోసీ, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, ఆర్ఐఎల్ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, సిప్లా, హెచ్యూఎల్, ఐషర్, డాక్టర్ రెడ్డీస్ 0.9-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి.
ఐడియా ప్లస్
ఎఫ్అండ్వో కౌంటర్లలో ఐడియా 6 శాతం జంప్చేయగా.. గోద్రెజ్ ప్రాపర్టీస్, కంకార్, వేదాంతా 4-2.6 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు పీవీఆర్, ఎన్ఎండీసీ, జీఎంఆర్, గ్లెన్మార్క్, అమరరాజా, బాలకృష్ణ ఇండస్ట్రీస్, జూబిలెంట్ ఫుడ్, బెర్జర్ పెయింట్స్ 5.5-1 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 940 లాభపడగా.. 991 నష్టాలతో కదులుతున్నాయి.