ఎల్ఐసీ ఐపీవో వచ్చేది అప్పుడేనంట?
పూర్తికాని కంపెనీ విలువ మదింపు
నియంత్రణ సంస్థల అనుమతుల ఎఫెక్ట్
జనవరి–మార్చిలోనే ఐపీవో అంటున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ ఆలస్యంకావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు కంపెనీ విలువ నిర్ధారణకు గడువుకంటే అధిక సమయం పట్టడం కారణమయ్యే వీలున్నట్లు పేర్కొంటున్నాయి. కంపెనీ విలువ నిర్ధారణ పూర్తయినప్పటికీ పలు ఇతర నియంత్రణ సంబంధ అంశాలను పరిష్కరించవలసి ఉన్నట్లు చెబుతున్నాయి. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లోగా ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీవోను చేపట్టలేకపోవచ్చని మర్చంట్ బ్యాంకర్లకు చెందిన ఒక సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. అయితే ప్రణాళికల మేరకు ఈ ఏడాది చివరి త్రైమాసికం(క్యూ4)లో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా విశ్వాసం వ్యక్తం చేశారు. ముందుగా అనుకున్న విధంగా క్యూ4 (జనవరి–మార్చి) లో ఐపీవోకు రానున్నట్లు తెలిపారు.
ఇతర అంశాలు: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతోపాటు.. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ నుంచి సైతం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి ప్రభుత్వం అనుమతులు తీసుకోవలసి ఉంది. అయితే ఈ ఏడాది మే నెలలో కుంతియా ఐఆర్డీఏ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నాక ఇప్పటివరకూ కొత్త అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం గమనార్హం. కాగా.. ఎల్ఐసీ విలువ మదింపులో పలు క్లిష్టమైన అంశాలున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. కంపెనీ పరిమాణం, విభిన్న ప్రొడక్టులు, రియల్టీ ఆస్తులు, అనుబంధ సంస్థలు, లాభాల పంపకం వంటి పలు అంశాలను పరిగణించవలసి ఉన్నట్లు వివరించారు.
చదవండి: యూజర్లకు ఎల్ఐసీ హెచ్చరిక! పర్మిషన్ లేకుండా అలా చేస్తే..