ఇన్వెస్టర్లలో గుబులు.. అమ్మకాల ఒత్తిడి.. స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు
ముంబై : దేశీ స్టాక్ మార్కెట్లు భారీ కుదుపులకు లోనవుతున్నాయి. గత వారం రోజులుగా వెలువడుతున్న పరస్పర విరుద్ధ ప్రకటనలతో దేశీ సూచీలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇన్వెస్టర్లు తక్షణ లాభాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ వారం కూడా స్టాక్ మార్కెట్ నష్టాలతో మొదలైంది. హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, హెచ్యూఎల్, కోటక్ మహీంద్రా షేర్లు నష్టపోతున్నాయి.
ఉదయం మార్కెట్ ప్రారంభమైంది మొదలు ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు ఎన్ఎస్ఈ నిఫ్టీలు నష్టపోయాయి. ఆ తర్వాత కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల అమలు, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్, క్రూడ్ ఆయిల్ ధరల పెంపు వంటి అంశాలు ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఉదయం 58,549 పాయింట్లతో స్వల్ప నష్టాలతో బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభమైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్ వరుసగా పాయింట్లు కోల్పోతూనే ఉంది. మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి 1136 పాయింట్లు నష్టపోయి దాదాపు 57,508 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. రెండు శాతం వరకు సెన్సెక్స్ క్షీణించింది. నిఫ్టీలో సైతం ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 337 పాయింట్లు నష్టపోయి 17,178 పాయింట్ల దగ్గర ట్రేడవుతూ ఇప్పటికే 1.93 శాతం క్షీణత నమోదు చేసింది.